Dissolution of Arogya Sree Trust?
ఆరోగ్యశ్రీ ట్రస్టు రద్దు?
- ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగింత
- పాత పద్ధతుల్లోనే తిరిగి ప్రైవేటుకు
- ఏటా సర్కార్పై 6 వేల కోట్లు భారం
- ఇప్పటికే కంపెనీలతో మంతనాలు
- కొత్త ఆర్థికఏడాదిలో అమలులోకి?
- తొమ్మిదేళ్ల క్రితం దాకా బీమాపద్ధతే
- లెక్కాపత్రం లేకుండా దోచిన వైనం
- అనుకూల ఆస్పత్రులే నెట్వర్క్లో
- అప్పట్లో వాటికే చెల్లింపుల్లో ప్రాధాన్యం
- ప్రభుత్వ యోచనపై తీవ్ర విమర్శలు
- ఆందోళనలో 2వేలమంది ఉద్యోగులు
- ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రద్దు కానున్నదా?
ట్రస్ట్ రావడానికి ముందున్న ఇన్సూరెన్స్ పద్ధతిలోకే తిరిగి మళ్లాలని చూస్తున్నారా? అంతా అనుకొన్నట్టు జరిగితే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చేస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే డేటా పరిశీలన కోసం ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయానికి వెళ్లడం ఈ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక కీలక అధికారి ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
ఆరోగ్యశ్రీ టెండర్ను దక్కించుకునేందుకు కొన్ని కంపెనీలు ప్రభుత్వ పెద్దల స్థాయిలో ఇప్పటికే పైరవీలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేసే విధానం ఈ పథకంతో తొలిసారి అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో నెట్వర్క్ ఆస్పత్రులు, శస్త్ర చికిత్సల ప్యాకేజీలు, ఇతర ప్యాకేజీలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదు. ఇలాంటి విషయాల్లో పెద్దగా అవగాహన కూడా లేదు. దీంతో తొలుత ఇన్సూరెన్స్ పద్ధతిలోనే ఆరోగ్యశ్రీని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. ఓ బీమా కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించింది.
2007 నుంచి 2011 వరకూ అంటే సుమారు నాలుగేళ్ల పాటు ఇదే పద్ధతిలో రోగులుకు సేవలు అందాయి. అయితే, ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా శస్త్ర చికిత్సలు చేయడం వల్ల ఏటా రూ.300 కోట్ల పైన భారం పడుతుందని ఈ క్రమంలో ప్రభుత్వం గుర్తించింది. దరిమిలా ఆ కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకొని 2012 నుంచి ట్రస్ట్ పద్ధతిలోకి మారారు. ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు మొత్తం ట్రస్ట్ ద్వారానే నిర్వహించే విధంగా విధివిధానాలను ప్రభుత్వం రూపొందించింది. అప్పటికి శస్త్ర చికిత్సల నిర్వహణ, నెట్వర్కింగ్పై ప్రభుత్వానికి పూర్తి అవగాహన రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రస్ట్కే ప్రభుత్వం నిధులు కేటాయించడం ప్రారంభించింది.
2012 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారానే పేద రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేసి మళ్లీ ఇన్సూరెన్స్ పద్ధతిలోకి వెళ్లాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై వందల కోట్లు భారం పడుతుందనేది గత అనుభవం చెబుతున్నా, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసమే ఈ విధానంలోకి తిరిగి మళ్లాలని చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బీమా భారమే!
ప్రస్తుతం రాష్ట్రంలో 1.42 కోట్ల బీపీఎల్ కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటి రేట్ల ప్రకారం కుటుంబానికి కనీసంగా సుమారు రూ.3000పైనా ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి ఏటా ఆరోగ్యశ్రీకే ప్రభుత్వం రూ.ఆరు వేల కోట్లు వరకూ బీమా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సర్కారుకు పెనుభారమే. ఇది చాలక, ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.1000 కోట్ల వరకూ బకాయిలున్నట్లు సమాచారం. ఈ మొత్తం క్లియర్ చేయాలంటే ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది. ఇదొక్కటే కాదు..ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగిస్తే.. వాటికి నచ్చిన ఆస్పత్రులనే నెట్వర్క్ పరిధిలోకి తీసుకునే అవకాశాలున్నాయి. బిల్లులు చెల్లింపులో కూడా ఇదే ధోరణి పెరిగే వీలుంది.
అప్పట్లో అంతా గల్లంతే..
2007 నుంచి 2011 దాకా రాష్ట్రంలో ఇన్సూరెన్స్ పద్ధతుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందాయి. ఆ కాలమంతా ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పిన లెక్కే ప్రభుత్వాలు ఖరారు చేసేవి. ఉదాహరణకు ఒక ఏడాది 2.1 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు సుమారు రూ.350 చొప్పున ఇన్సూరెన్స్ చేయించిందనుకొన్నాం. ఇంతమంది.. ఇన్ని శస్త్రచికిత్సలు.. ఇంత ఖర్చు అని లెక్కలు వేసుకొని సదరు బీమా కంపెనీ రూ.900 కోట్లు అడిగింది. అంతే.. ఆ కంపెనీ అడినంత ఇచ్చేయడమే! వాస్తవంలో ఇందులో సదరు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా జరిగేది సుమారు రూ.700 కోట్ల విలువైన ఆపరేషన్లు మాత్రమే. మిగతా రూ.200 కోట్లు సదరు కంపెనీ జేబుల్లోకి వెళ్లేవి. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చు కింద ప్రభుత్వం నుంచి ముట్టే 10 నుంచి 15 శాతం పర్సంటేజ్ నిధులు దీనికి అదనం.
0 Response to "Dissolution of Arogya Sree Trust?"
Post a Comment