Five Important Places of Patriotism in India
ఇండియాలో దేశభక్తిని నింపే ఐదు ముఖ్యమైన ప్రదేశాలు
1947 ఆగస్టు 15న సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించుకొని 1950, జనవరి 26న మన సొంత రాజ్యాంగాన్ని అమలు పరచుకున్నాం. అప్పటి నుంచి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించింది. భారతదేశ చరిత్రలో ఇది చెప్పుకోదగ్గ రోజు కాబట్టి దేశవ్యాప్తంగా ఈ రోజున పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు.మన దేశంలో చాలా నగరాల్లో గణతంత్ర వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. దేశభక్తి భావనను పెంచే అనేక ప్రదేశాలు ఈ రోజున దేశ ప్రజలకు ఆహ్వానం పలుకుతుంటాయి. వాటిలో 5 ఉత్తమమైన ప్రదేశాలు....
న్యూఢిల్లీ: దేశంలో ఏ నగరంలో జరగని విధంగా దేశ రాజధాని నగరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. ఇక్కడ రాజ్ పథ్ లోని అద్భుతమైన పెరేడ్ ను చూసేందుకు దేశ ప్రజలు ఆశక్తి కనబరుస్తారు.రాష్ట్రపతి భవన్ వద్ద ప్రారంభమయ్యే ఈ పెరేడ్ రాజ్ పథ్ మీదుగా ఇండియా గేట్ వరకూ సాగుతుంది. దీనిని జీవితంలో ఒక్కసారైనా ప్రత్యక్ష్యంగా వీక్షించాలని చాలా మంది కోరుకుంటారు. ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించిన తరువాత ఎర్రకోట, జామా మస్జిద్, హుమాయూన్ సమాధి వంటి అనేక ఆసక్తికరమైన ప్రదేశాలను తప్పకుండా చూసి రండి.
అమృత్ సర్: స్వాతంత్ర్య ఉద్యమంలో పంజాబ్ లోని అమృత్ సర్ కు గొప్ప చరిత్ర ఉంది.జలియన్ వాలా భాగ్, వాగా సరిహద్దుకు ఇది నిలయం. చిన్న సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడి జలియన్ వాలా భాగ్ లో జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళి అర్పిస్తారు. వాగా సరిహద్దు వద్ద సూర్యాస్తమయం సమయంలో జరిగే జెండా కార్యక్రమాన్ని వీక్షించడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దులో భద్రతా దళాలు స్వీట్లు పంచుకోవడంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనను కూడా ఇస్తాయి. అమృత్ సర్ లో బంగారు దేవాలయం, అకల్ తఖ్త్, హాల్ బజార్ వంటి అనేక పర్యాటక ప్రదేశాలు తప్పకుండా వీక్షించాలి.
అహ్మదాబాద్: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, జాతి పిత అయిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ యొక్క స్వస్థలం అహ్మదాబాద్. ప్రతి జాతీయ వేడుక రోజున ఈ నగర పౌరులు గాంధీని తలచుకుని నివాళి అర్పిస్తారు.
గణతంత్ర దినోత్సవ రోజున ప్రజలంతా ఒకే చోట చేరుకుని మువ్వన్నెల జెండాను గాంధీ నగర్ లో ఎగురవేస్తారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, డాగ్ స్క్వాడ్ తో చిన్న పెరేడ్ నిర్వహిస్తారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులను అందిస్తారు. సబర్మతి ఆశ్రమం, జామా మసీదు, కలికో టెక్స్ టైల్ మ్యూజియం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్మారకం వంటి అనేక ఆసక్తికరమైన ప్రదేశాలను అహ్మదాబాద్ లో చూడవచ్చు.
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ సంఘర్షణ గల ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా చురుగ్గా జరుగుతాయి. శ్రీనగర్ లోని బక్షి స్టేడియంలో ప్రతి ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడ పాఠశాల విద్యార్ధులు, భద్రతా దళాలు, పోలీసులచే జెండా ఎగురవేసేందుకు మంత్రులు అధ్యక్షత వహిస్తారు. మంచు కురిసే ఈ ప్రదేశంలో భద్రతా దళాల కవాతు ఎంతో అద్భుతంగా ఉంటుంది.
జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ సరస్సు, జమ్ము పట్టణం, గుల్మర్గ్, లేహ్, ఉద్ధంపూర్, సొంమార్గ్ వంటి అనేక ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. టూరిస్టులు ఇక్కడ ఒక అందమైన హాలిడే ను గడపవచ్చు.
బెంగళూరు: దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద కంటోన్మెంట్ లలో బెంగళూరు ఒకటి. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇక్కడ ఎంతో ఉత్సాహభరితంగా నిర్వహిస్తారు.ప్రతి సంవత్సరం కర్ణాటక గవర్నర్ ఎంజి రోడ్ కు దగ్గర్లో ఉన్న ఫీల్డ్ మార్షల్ మానేక్షా పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. జెండా ఎగురవేసిన తరువాత ఎన్.సి.సి, పోలీస్ ఫోర్స్, వైమానిక దళం, సాయుధ దళాలు నిర్వహించే కవాతు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అదే విధంగా ఈ రోజున బెంగళూరులోని లాల్ భాగ్ బొటానికల్ గార్డెన్స్ లో నిర్వహించే ఫ్లవర్ షోను ప్రతి ఒక్కరూ తప్పక వీక్షించాలి. వీటితో పాటు నగరంలోని కబ్బన్ పార్క్, ఎం.జి.రోడ్, ఇస్కాన్ ఆలయం, అల్సూర్ సరస్సు, యుబి సిటీ వంటి అనేక ప్రదేశాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి.
0 Response to "Five Important Places of Patriotism in India"
Post a Comment