Inspiration
చదివాడు..చర్చించాడు.. టాప్లో నిలిచాడు!
జేఈఈ బీఆర్క్ దివ్యాంగుల విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించాడు.
జేఈఈ బీఆర్క్ దివ్యాంగుల విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించాడు.
విజయానికి వైకల్యం అడ్డుకాదనీ, ఆశయానికి ఉత్తమ ఆచరణ తోడైతే సానుకూల ఫలితం వస్తుందనీ నిరూపించాడు జోగి కపిల్దేవ్. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఈ విద్యార్థిది మధ్య తరగతి కుటుంబం. పట్టుదలతో కృషి చేశాడు. చదివిన అంశాలపై పట్టు కోసం మిత్రులతో చర్చించాడు. జేఈఈ మెయిన్స్- బి.ఆర్క్లో 99.78 మార్కులతో దివ్యాంగుల విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ఇష్టంతో చదివి ఐఏఎస్ సాధించేందుకు సోపానాలు వేసుకున్నాడు.
చిన్నతనం నుంచీ కపిల్దేవ్కు చదువంటే ప్రాణం. తండ్రి జోగి వెంకటదుర్గ రాంప్రసాద్ చిరు వ్యాపారి, తల్లి ఉమామహేశ్వరి గృహిణి. పదోతరగతిలో స్కాలర్షిప్ కోసం ఎన్టీఎస్ఈ పరీక్ష రాశాడు. దీనికి సన్నద్ధమయ్యే సమయంలోనే రీజనింగ్ అంశాలను చేసేవాడు. అది క్రమంగా అలవాటుగా మారింది. ప్రతిరోజు ఉదయం 1-2 గంటలు దానికోసం కేటాయించుకునేవాడు. దీంతో సమస్యకు విభిన్న పరిష్కారాలు ఆలోచించే తత్వం అలవడింది. దీంతో పాటు పదోతరగతి నుంచే వార్తాపత్రికల్లో బ్యాంకు పరీక్షల్లోని ప్రశ్నలు సాధన చేయటం ప్రారంభించాడు. పదునైన ఆలోచనల కోసం విరామ సమయాల్లో చదరంగం ఆడేవాడు. ఇవన్నీ జేఈఈ బీఆర్క్ ప్రవేశపరీక్షలో పరోక్షంగా ఉపయోగపడ్డాయి.
ఇంటర్లో అన్నయ్య ప్రోత్సాహం, సహకారానికి తోడు జంగారెడ్డిగూడెం విద్యావికాస్ జూనియర్ కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం లభించాయి. ఇంటర్ పాఠ్యాంశాలు, బీఆర్క్ ప్రవేశపరీక్ష కోసం ప్రతిరోజూ 12 నుంచి 14 గంటలు చదివాడు. నేర్చుకోవాల్సిన అంశాలను ఉదయమే రాసుకుని కాలపట్టికను రూపొందించుకున్నాడు. ఏ రోజు నిర్దేశించుకున్న అంశాలను కచ్చితంగా ఆ రోజే పూర్తిగా నేర్చుకున్నాడు. గణితానికి రోజులో 4 నుంచి 5 గంటలు కేటాయించాడు. మిగిలిన సమయంలో భౌతిక, రసాయన శాస్త్రాలు, బీఆర్క్కు సంబంధించిన అంశాలపై తయారయ్యాడు. చదివిన అంశాలను స్నేహితుల దగ్గర చర్చించటం ద్వారా పునశ్చరణను కూడా పూర్తిచేసుకున్నాడు. ఈ రకమైన బహుముఖ కృషి ద్వారా జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ బీఆర్క్లో అత్యుత్తమ స్థానంలో నిలిచాడు.
చిన్నతనం నుంచి ఐఏఎస్ కావాలని కపిల్ ఆశయం. అందుకే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమకాలీన సామాజిక స్థితుల పట్ల కూడా అవగాహన పెంచుకుంటున్నాడు. కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి సివిల్స్కు సంసిద్ధం కావాలని ప్రణాళికలు రచిస్తున్నాడు.
లక్ష్యంపై ఇష్టం ఉండాలి: కపిల్దేవ్
బీఆర్క్లో అయినా, మరే పోటీ పరీక్షలోనైనా మంచి ర్యాంకు సాధించాలంటే ఆ లక్ష్యంపై ఇష్టం ఉండాలి. ఏకాగ్రత చూపాలి. పరీక్షలో వేగం ఎంత ముఖ్యమో కచ్చితత్వం అంతకన్నా ముఖ్యం. పరీక్ష సమయంలో అందరిలాగే నేనూ ఒత్తిడికి గురయ్యాను. కొన్ని అంశాలను అతి విశ్వాసంతో తేలిగ్గా తీసుకున్నాను. ఇలాంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్తపడాలి. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పడిన కష్టానికి న్యాయం జరగాలంటే పరీక్ష రాసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అధ్యాపకులు పరీక్ష సమయంలో చెప్పే చిన్న చిన్న అంశాలను చాలామంది పట్టించుకోరు. ఈ ప్రభావం మార్కులపై తప్పక ఉంటుంది. మంచి ర్యాంకు సాధించాలంటే అధ్యాపకుల సలహాలు, సూచనలు శ్రద్ధగా పాటించడం అవసరం. జేఈఈకి సిద్ధమయ్యేవారు ఈ అంశాలు గుర్తుపెట్టుకుంటే మంచి ర్యాంకు సాధ్యమే!
0 Response to "Inspiration"
Post a Comment