Does the tenth class result in justice for talent?
పది ఫలితాల్లో ప్రతిభకు న్యాయం జరిగేనా?
ఆందోళనలో పది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.
ఆందోళనలో పది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.
కరోనా కారణంగా ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ నిర్ణయించిన విషయం తెలిసిందే. విద్యార్థులకు కేటాయించే గ్రేడ్లపై కూడా విధి విధానాలు ప్రకటించి దానికి అనుగుణంగా ఫలితాలు వెల్లడిస్తామని కూడా ప్రకటించారు. అయితే ఏయే అంశాల ప్రాతిపదికన ఫలితాలు ప్రకటిస్తారన్న ఆందోళన ఇటు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లోనూ నెలకొంది.
పాఠశాల స్థాయిలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఆధారంగా చేసుకుని గ్రేడ్లు ప్రకటిస్తారని విద్యాశాఖవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. గత విద్యాసంవత్సరం నుంచి పదోతరగతి విద్యార్థులకు కేటాయించే అంతర్గత మార్కులను రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎఫ్ఎ-1,2,3,4 పరీక్షలను 50 మార్కులకు ఎస్ఎ-1 పరీక్షలను పేపరుకు 50 మార్కుల చొప్పున నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలోని ఆయా పాఠశాలల్లో ఆయా తరగతుల విద్యార్థులకు ఎఫ్ఏ-1,2,3, ఎస్ఏ-1 పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను అంతర్జాలంలో నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటివరకు ఎఫ్ఏ-4 పరీక్షల ఫలితాలను మాత్రం సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయలేదు. ఈ ఫలితాల విషయం కూడా అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఎఫ్ఎ-4 ఫలితాల నమోదు ఎప్పుడో?
ఎఫ్ఏ-1,2,3 పరీక్షల ఫలితాలు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు నమోదు చేసినా ఎఫ్ఏ-4 ఫలితాలను మాత్రం ఇంకా నమోదు చేయాల్సి ఉంది. దీంతోపాటు అనారోగ్యం, కుటుంబ పరిస్థితుల కారణంగా ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలకు కొంతమంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వారంతా ఆందోళన చెందుతున్నారు. అంతర్గత మార్కుల ప్రస్తావన లేకపోవడంతో ఫలితాలకు పబ్లిక్ పరీక్షలే ప్రామాణికంగా తీసుకుంటారని భావించి కొన్ని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు అలసత్వం ప్రదర్శించారనే విమర్శలున్నాయి. అయితే పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ఎఫ్ఏ-1,2,3 పరీక్షల ఫలితాలు పూర్తిస్థాయిలో నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎఫ్ఏ-4 ఫలితాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రస్తుతం అధికారులు ఆదిశగా ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. సర్వర్ సమస్య కారణంగా నమోదు ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తి చేస్తారో అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
స్పష్టత లేదు
ఎఫ్ఏ-4 ఫలితాల నమోదుకు ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని కొన్ని ప్రయివేటు పాఠశాలలు మార్కులు తమ చేతుల్లోనే ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూళ్లు ప్రారంభిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రయివేటు పాఠశాలలే కాదు ప్రభుత్వ పాఠశాలలు సైతం తమ పాఠశాలకు ఉత్తమ ఫలితాలు రావాలన్న కారణంతో ఎఫ్ఏ-4 ఫలితాలను ఎక్కువగా చూపించుకునే అవకాశం కూడా ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలా జరిగితే ప్రతిభగల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏ ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని గ్రేడ్లు కేటాయిస్తుందనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు.
ఫలితాలు నమోదు చేస్తున్నారు
ఎఫ్ఏ-4 పరీక్షల ఫలితాల నమోదు ప్రక్రియ జరుగుతోంది. కొన్ని సార్లు సర్వర్ సమస్య ఏర్పడిన మాట వాస్తవమే. ప్రస్తుతం సర్వర్ బాగానే పనిచేయడంతో ఉపాధ్యాయులు ఫలితాలు నమోదు చేస్తున్నారు. ఈప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేలా కృషి చేస్తున్నాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ ఫలితాలను ప్రామాణికంగా తీసుకుంటారు, గ్రేడ్లు ఎలా కేటాయిస్తారన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
0 Response to "Does the tenth class result in justice for talent?"
Post a Comment