Is the school bell ringing?
బడి గంట మోగేనా?
కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో విద్యాసంస్థల ప్రారంభంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబరు 5వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే పాఠశాలలను తెరిచినా, జగనన్న విద్యాకానుక కిట్లను అందజేసి సెలవులు ఇవ్వాల్సిన స్థితి ఏర్పడుతుందనే వాదనను విద్యాశాఖ నిపుణులు వినిపిస్తున్నారు. పాఠశాలలు తెరిస్తే విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించే విషయంలో ఉపాధ్యాయలు ఎంత వరకు జాగ్రత్తలు తీసుకోగలరనే అంశంపైనా అనేక అనుమానాలు ఉన్నాయి. పాఠశాలలు తెరవడంపై ఉపాధ్యాయులు ఎవరూ పెదవి విప్పడంలేదు.
జూన్లో ప్రారంభం కావాల్సిన పాఠశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపైనా స్పష్టతలేదు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అన్లాక్-4.0 నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాలలు నడపడంపై ఎలాంటి సూచనలు వస్తాయనే అంశంపైనే అంతటా చర్చ నడుస్తోంది.
విడతలవారీగా క్లాసులు నిర్వహిస్తారా?
జూన్లో ప్రారంభం కావాల్సిన పాఠశాలలు, కళాశాలలు ఎప్పటికి ప్రారంభమవుతాయనే అంశంపై ఇంకా స్పష్టతలేదు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కొందరు ఈ తరహా క్లాసులకు అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరగడం లేదు. వర్చువల్ క్లాసుల ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వర్చువల్ క్లాసులు నడిపేందుకు జిల్లాలో 300 పాఠశాలల్లో అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదే పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు వర్చువల్ తరగతులు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అనుమతులు ఇచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాల స్థాయి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు వర్చువల్ తరగతులు నిర్వహించేందుకు టైమ్టేబుల్ను రూపొందించాల్సి ఉంది. పాఠశాల స్థాయిలో పదో తరగతికి ముందుగా, అనంతరం దిగువ తరగతులకు విడతలవారీగా తరగతులు నిర్వహిస్తారా? లేక వీరికి కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారా? అనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.
నియంత్రణ సాధ్యమేనా?
జిల్లాలో 4,442 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిలో 6.20 లక్షలమందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ కనీస సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పాఠశాలకు హాజరైన విద్యార్థులు తరచూ శానిటైజర్ వాడటం, లేదా సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవడం ఎంతమేర పాటిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. తాగునీటి కోసం అందరూ ఒకే చోటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరుగుదొడ్లు, అక్కడ నీటివసతి సంగతి సరేసరి. విద్యార్థులు కనీసం ఐదు గంటలు పాఠశాలలో ఉండాలి. విద్యార్థికి, విద్యార్థికి మధ్య కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. అంత జాగా పాఠశాలల్లో ఉందా? ఇరుకిరుకు తరగతి గదుల్లో.. అదీ వర్షాకాలంలో దూరం పాటించడం సాధ్యమేనా? అనేది ప్రశ్నార్థకమే. ఇలాంటి స్థితిలో కరోనా వైరస్ వ్యాపించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయనే వాదన ఉంది.
ఒకపక్క కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గత రెండు రోజులుగా 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందో ఇదమిద్దంగా చెప్పలేని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు విముఖంగానే ఉన్నారు. ఒక విద్యాసంవత్సరం నష్టపోయినా పర్లేదు.. వచ్చే సంవత్సరమైనా చదివించవచ్చనే ఆలోచనలో అధిక శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉండటం గమనార్హం.
It’s really such nice information to get advantage from.
ReplyDeleteUX design companies