Corona pressure on education.
విద్యపై కరోనా ఒత్తిడి.
కోవిడ్-19 మహమ్మారి పిల్లల విద్యాభ్యాసంలో అనివార్యంగా మోసుకొచ్చిన పెను మార్పులను, విద్యార్థులు, తల్లిదండ్రులపై పెంచిన ఆర్థిక, మానసిక, సామాజిక ఒత్తిడులను యాన్యువల్ ఎడ్యుకేషన్ స్టేటస్ రిపోర్టు (ఎఇఎస్ఆర్)-2020 కళ్లకు కట్టింది. కొన్నేళ్లుగా విద్యారంగంపై సర్వే చేస్తున్న 'ప్రథమ్' అనే స్వచ్ఛంద సంస్థ కరోనా కాలంలో విద్యారంగంపై పిడుగుపాటులా వచ్చి పడ్డ మార్పులపై దేశంలోని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫోన్ సర్వే నిర్వహించగా వెల్లడైన దృష్టాంతాలు మిక్కిలి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల్లో మూడింట ఒక వంతు మందికే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. పదకొండు శాతం మందికే ఆన్లైన్ క్లాసులు అందుబాటులో ఉన్నాయి. కేవలం 24.3 శాతం మందికే లెర్నింగ్ మెటీరియల్ అందింది. లెర్నింగ్ మెటీరియల్ పొందాలంటే స్మార్ట్ఫోన్-వాట్సాప్ ఉండాలి. 75 శాతం స్కూళ్లకు వాట్సాప్ సదుపాయం లేదు. అసలు 43.6 శాతం మందికి స్మార్ట్ఫోన్లే లేవు. ఒక ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, తల్లిదండ్రులు రెండో ఫోన్ కొన లేక, ఇంటర్నెట్ రీఛార్జి చేసుకునే స్తోమత లేకపోతే, ఆడ పిల్లలకు కాకుండా మగ పిల్లలకు ఫోన్ ఇస్తున్నారు. లాక్డౌన్లో అడ్మిషన్లు లేక ఐదు శాతం మంది డ్రాపవుట్లుగా మారారు. ప్రైవేటు ఫీజులు భరించలేక ఈ కాలంలో ఐదు శాతానికి పైన పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు మారారు. గ్రామీణ, అందులోనూ మారుమూల ప్రాంతాలు నేటికీ ఇంటర్నెట్కు దూరంగా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎఇఎస్ఆర్ అధ్యయనం బహిర్గతపర్చిన అనేకానేక అంశాలు వాస్తవ చిత్రానికి పక్కా ప్రతిబింబాలు.
మార్చి 25 నుంచి దేశ వ్యాప్త లాక్డౌన్ విధించగా అన్లాక్-5 నిబంధనల్లో అక్టోబర్ 15 నుంచి విద్యాసంస్థలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతించింది. అది కూడా రాష్ట్రాల ఇష్టానికి వదిలేసింది. దాంతో చాలా చోట్ల స్కూళ్లు తెరుచుకోలేదు. పైపెచ్చు తమ పిల్లలను తమ ఇష్టపూర్వకంగా బడులకు పంపుతున్నట్లు తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక డిక్లరేషన్ను తప్పనిసరి చేయడంతో పేరెంట్స్ భయపడుతున్నారు. లాక్డౌన్ నుంచి మొదలు పెడితే కరోనా నుంచి పూర్తిగా కుదుట పడేంత వరకు డిజిటల్ ఎడ్యుకేషనే పిల్లలకు దిక్కుగా కనిపిస్తోంది. ఈ అనివార్యత ముందున్న వేళ ఎఇఎస్ఆర్ అధ్యయనంలో వెల్లడైన క్షేత్ర స్థాయి ఇబ్బందులు మన మన విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తాయని, భావి భారత పౌరులుగా ఎదగాల్సిన పిల్లల భవిష్యత్తును అగాధంలో నెడతాయన్న భయాందోళనలు కలుగుతున్నాయి. కరోనా భయం వీడి తరగతి గదుల్లో సురక్షితంగా విద్యార్థులు అడుగు పెట్టే వరకైనా పాఠ్యపుస్తకాలు, స్మార్ట్ఫోన్లు, లెర్నింగ్ మెటీరియల్ ట్రాన్స్మిషన్, పిల్లలకు వ్యక్తిగత ట్యూషన్ సెషన్ల నిర్వహణ వంటి కనీస చర్యలకు ప్రభుత్వాలు పూచీ పడాలన్న ఎఇఎస్ఆర్ సూచన సహేతుకమైంది. కేరళ, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కంటే ముందే సర్కారీ స్కూళ్లల్లో డిజిటల్ క్లాస్రూమ్ కాన్సెప్టును అక్కడి ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. కేరళ వంద శాతం స్కూళ్లను డిజిటలైజ్ చేసి ఆదర్శంగా నిలిచింది.
స్కూళ్లు ఎప్పటి నుంచి తెరుచుకోవచ్చో చెప్పడానికి కేంద్రం పరిమితమైంది. సరిగ్గా కరోనా సమయంలోనే విద్య కార్పొరేటీకరణ, కాషాయీకరణ లక్ష్యంగా కొత్త విద్యా విధానాన్ని తెచ్చిన మోడీ సర్కారు విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచుతుందని ఆశించలేం. ఇక మన రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి మూడు దశల్లో స్కూళ్లు తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో కోవిడ్ ప్రొటోకాల్స్ను విధిగా పాటించేలా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. పిల్లలను ఎవరి శానిటైజర్ వాళ్లనే ఎవరి మాస్క్ను వాళ్లనే తెచ్చుకోమంటే కుదరదు. ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందిని స్కూళ్ల వద్ద ప్రత్యేకంగా నియమించాలి. కొంత మేర ఆన్లైన్ స్టడీకి అవకాశం ఇచ్చినందున అందుకు కావాల్సిన సదుపాయాలను సర్కారే కల్పించాలి. ఆన్లైన్ క్లాసులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఒకేలా ఉండాలి. ఈ కనీస చర్యలకు ప్రభుత్వం ముందుకు రాకపోతే ఎఇఎస్ఆర్ అధ్యయనానికి మించిన విపత్కర పరిస్థితులు నెలకొంటాయి.®️
0 Response to "Corona pressure on education."
Post a Comment