Online Lesson .. Let's Listen .. Let's Learn!
ఆన్ లైన్ పాఠం.. విందాం.. నేర్చుకుందాం!
కరిగిపోతున్న కాలం
ఇక మిగిలింది ఐదు నెలలే
ఇప్పటికే విద్యాసంవత్సరం నాలుగు నెలలు గడిచిపోయింది. ఇక మిగిలింది ఐదు నెలలు మాత్రమే. జూన్ నుంచి విద్యాలయాల ప్రారంభం వాయిదా పడుతూనే వస్తోంది. నవంబరు 2 నుంచి పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోనూ తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే విద్యార్థులు బడికి రావాలని సూచించింది. ఈ క్రమంలో ఆన్లైన్ పాఠాలే కీలకంగా మారాయి. చరవాణి ద్వారా పాఠాలు విని నేర్చుకునే పరిస్థితి వచ్చింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం పట్టింపు లేదు. దూరదర్శన్లో చెబుతున్నాం.. విన్నవారు వింటారు.. అనే ధోరణిలో ఉన్నారే తప్ప సరైన పర్యవేక్షణ లేదు. విద్యాశాఖ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ చూపకపోతే విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది.
ఇలా చేస్తే మేలు
- ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకోవాలి.
- వాట్సాప్ గ్రూపులు, జూమ్యాప్ ఏర్పాటు చేసుకుని ఎంత మంది వింటున్నారో నిత్యం పరిశీలించాలి.
- ప్రతి ఉపాధ్యాయుడు రిపోర్టు తయారు చేసుకోవాలి.
- ఇంటర్ పాఠాలు వినని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి చైతన్యం నింపాలి.
- దూరదర్శన్ ద్వారా విన్న పాఠ్యాంశాలపై అనుమానాలు నివృత్తి చేయాలి.
- ఆన్లైన్ ద్వారా తరగతులు వినాలంటే నెలకు కనీసం రూ.300 అంతర్జాలానికి వెచ్చించాల్సి ఉండటంతో పేద విద్యార్థులు భారంగా భావిస్తున్నారు.
- ప్రత్యేకంగా యాప్లు తయారు చేసి ట్యాబ్స్ అందజేస్తే ఉపయోగం ఉంటుంది.
- అన్ని ప్రాంతాలకు నెట్వర్క్ సౌకర్యం కల్పించాలి.
గురుతర బాధ్యత ఏదీ?
ప్రస్తుతం ఉపాధ్యాయులు 50 శాతం మంది పాఠశాలలకు హాజరవుతున్నారు. మొదటిసారిగా విద్యామృతం పేరుతో మే 4 నుంచి 20 వరకు రేడియోలో పాఠాలు అందించారు. జూన్ 10 నుంచి దూరదర్శన్ ద్వారా 1 నుంచి 9వ తరగతి వరకు బోధన ప్రారంభించారు. అనంతరం పదోతరగతి వరకు అవకాశం కల్పించారు. అయితే దూరదర్శన్లో పాఠాలు ఎంతమంది వింటున్నారో పట్టించుకోవడం లేదు. గురువులు చెబితే వినని పిల్లలు ఎవరూ ఉండరు.
30 శాతం మందే హాజరు
ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 10నుంచి ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే తక్కువమంది హాజరవుతున్నారు. విద్యార్థులు ఎక్కువగా గ్రామీణులు. వ్యవసాయ, ఇతరత్రా పనులకు వెళుతున్నారు. చరవాణి ఉన్నవారు సైతం తరగతులకు హాజరుకావడం లేదని ఇటీవల తేల్చారు. ఆండ్రాయిడ్ ఫోన్లు 5 వేల మంది వరకు ఉండగా.. లేనివారు 7 వేలు మంది ఉన్నారు. సెల్ఫోన్లు ఉన్నా వినియోగించని వారు 2 వేలకు పైగానే ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 8,920 మంది విద్యార్థులు తరగతులకు దూరంగా ఉంటున్నారు. అంటే 30 శాతం మందే పాఠాలు వింటున్నారు. 581 మంది అధ్యాపకులు ఉన్నారు. ఒక్కో అధ్యాపకుడు 20 మంది విద్యార్థులతోనూ, వారి తల్లిదండ్రులతో మాట్లాడితే ఇంటర్ గెలిపించడం పెద్ద కష్టం కాదు.
తల్లిదండ్రులే మొదటి గురువులు
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే ఎక్కువ. నగర ప్రాంత విద్యార్థులకు కొంతవరకు చైతన్యం కల్పిస్తున్నా.. గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు ఇప్పటికీ పిల్లలకు టీవీలు, చరవాణిలు ఇస్తే చెడిపోతారనే భయం ఉంది. అలాంటి అపోహలు తొలగేలా ఉపాధ్యాయులు చైతన్యం కల్పించాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా టీవీలు, చరవాణి ద్వారా పాఠాలు వినే అవకాశం కల్పించాలి. ఆస్తి కంటే పిల్లల చదువే ముఖ్యమని మరవొద్ధు.
పెద్దన్న పాత్ర పోషించాలి
ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఉపవిద్యాశాఖాధికారులు పెద్దన్న పాత్ర పోషించాలి. తమ పరిధిలో విద్యార్థులు పాఠ్యాంశాలు వింటున్నారో లేదో నివేదికలు తెప్పించుకోవాలి. ఏదో ఉత్తర్వులు ఇచ్చి వదిలేయకుండా పర్యవేక్షించాలి. దూరదర్శన్ నుంచి ప్రతి నెలా వచ్చే షెడ్యూల్ను వాట్సాప్ గ్రూపుల ద్వారా సీఆర్పీ, తల్లిదండ్రుల కమిటీలకు పంపాలి. వారిని భాగస్వాములను చేయాలి.
బాధ్యతగా భావించాలి
ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతగా భావించాలి. విద్యార్థులు పాఠాలు వింటున్నారా లేదో తెలుసుకుని నివేదిక సిద్ధం చేసుకోవాలి. తమ పిల్లల్లా భావించాలి. చరవాణి గ్రూపుల ద్వారా విద్యార్థులకు అనుమానాలు నివృత్తి చేయాలి. ప్రతి విద్యార్థి పాఠాలు వినేలా చొరవ చూపాలి. - శామ్యూల్, డీఈఓ
0 Response to "Online Lesson .. Let's Listen .. Let's Learn!"
Post a Comment