Confusion in Inter Online Admissions
సీటుకు భరోసా లేదాయే..
- ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల్లో గందరగోళం
- ఇంకా నిర్ణయంకాని ఫీజులు
- విద్యార్థుల్లో అయోమయం
ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం విద్యార్థులు, తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నాయి. దీనిపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది. అయితే ఎప్పటికి స్పష్టత వస్తుందోనని విద్యార్థులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఈ ఏడాది విద్యా వ్యవస్థ ఇబ్బందులకు గురైంది. కొవిడ్ కొంత తగ్గుముఖం పట్టిందని ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించగా అది కూడా ఆటంకాలతో ముందుకు సాగడం లేదు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 198 జూనియర్ కళాశాలలున్నాయి. సాంఘిక సంక్షేమం పరిధిలో 14, ఏపీ మోడల్ పాఠశాలలు 11, కేజీబీవీలు 14లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అవి పోనూ ఆన్లైన్ వెబ్సైట్లో 33 ప్రభుత్వ, 11 ఎయిడెడ్, 96 ప్రైవేటు కళాశాలలు ఉండాలి. కాగా రేకుల షెడ్లు, ఇరుకు ప్రదేశాలు, అంతస్తుల్లో ఏర్పాటు చేసిన వాటికి అనుమతి లభించలేదు. ప్రస్తుతానికి 70 ప్రైవేటు మాత్రమే ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. ఒంగోలు, చీరాలలో ఆ విధంగా ఉన్న 26 ప్రైవేటు వాటికి ఇంతవరకు అనుమతి రాలేదు.
సీటు వస్తుందా.. రాదా!
ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చేరాలనుకుంటున్న విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యాజమాన్యాలు ముందుగానే విద్యార్థులు, తల్లిదండ్రులను కలిసి ఒప్పందం చేసుకున్నాయి. వారి సమక్షంలోనే ఆన్లైన్లో ఆప్షన్లు పెట్టించాయి. కార్పొరేట్ కళాశాలలకు జిల్లాలో వివిధ పేర్లుతో మూడు నుంచి నాలుగు కళాశాలలున్నాయి. విద్యార్థి ఆన్లైన్లో గరిష్ఠంగా అయిదు ఆప్షన్లు పెట్టుకునే వెసులుబాటు ఉండగా యాజమాన్యాలు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వారు కోరుకున్న కళాశాలను మొదటి ఆప్షన్గా పెట్టించాయి. తరువాత వరుసలో వారి కళాశాలలనే నమోదు చేయించాయి. అయిదు కళాశాలల పేర్లు పెట్టకపోయినా ఆన్లైన్లో తీసుకుంటుంది. దీంతో యాజమాన్యాలు ముందుగా అడ్వాన్సులు తీసుకొని సీటు వస్తుందని నమ్మబలికాయి. రోజులు గడిచే కొద్దీ తాజా పరిణామాలు విద్యార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. షెడ్లలో నడిచే వాటికి ఇంకా అనుమతి రాలేదు. అనుమతి ఉన్న కళాశాలల్లో రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించాలి. ఆ విధంగా విద్యార్థులు కోరుకున్న కళాశాల వస్తుందనే నమ్మకం లేదు. జిల్లాలో సుమారు 40 వేల సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో ఆర్ట్స్, ఒకేషనల్ పోగా మిగిలినవి ఎంపీసీ, బైపీసీకి కేటాయిస్తారు. వచ్చిన దరఖాస్తులో రిజర్వేషన్ చూడాలి. ఈ విధంగా విద్యార్థి కోరుకున్న కళాశాల రాని పక్షంలో యాజమాన్యాలకు చెల్లించిన అడ్వాన్సులు తిరిగి రాబట్టుకోవాల్సివస్తుంది. ఇదిలా ఉంటే ఫీజులపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రస్థాయిలో ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇంతవరకు ట్యూషన్ ఫీజు వసూలుపై నిర్ణయం తీసుకోలేదు. దానిని బట్టి కొంతమంది విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకుంటారు.
నేడు స్పష్టతకు అవకాశం
ఆన్లైన్ విధానంపై కోర్టు స్టే మంగళవారం వరకు ఉన్నందున ఈ సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు ఆప్షన్లు పెట్టుకోవచ్ఛు ఫీజుల వివరాలు రావాల్సివుంది. ప్రస్తుతానికి పాత ఫీజులు అమలులో ఉంటాయి. - వీవీ సుబ్బారావు, ఆర్ఐవో
0 Response to "Confusion in Inter Online Admissions"
Post a Comment