Health is more important than education
చదువు కంటే ఆరోగ్యమే ముఖ్యం
చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యం అని కాకుండా చదువు కంటే ఆరోగ్యమే ముఖ్యం అన్నట్లుగా కరోనా కాలంలో బడులు నిర్వహించాలని శాసనమండలి పిడిఎఫ్ ఫ్లోర్లీడర్ వి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఈ విద్యాసంవత్సరం నష్టపోకూడదనే లక్ష్యానికి పరిమితమయ్యేలా పాఠశాలల్లో వాతావారణం ఉండాలని చెప్పారు. పిల్లలకు బడి అలవాటు తగ్గిపోకుండా చేయడానికి జాగ్రత్తగా నడపాలని సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పౌష్లికాహారంగా ఉండాలని చెప్పారు. తల్లిదండ్రులే పిల్లలను బడికి తీసుకెళ్లడం, తీసుకురావడం చేయాలని సూచించారు. లేదంటే గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. కరోనా కాలంలో పాఠశాలలు ప్రారంభించిన సందర్భంగా బాలసుబ్రహ్మణ్యంతో ప్రజాశక్తి ప్రతినిధి చేసిన ఇంటర్వ్యూ..
ప్ర : కరోనా కాలంలో బడులు తెరవడంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. తెరిచేందుకు అనుకూల వాతావరణం ఉందా?
జ : బడులు తెరవకపోవడం వల్ల పేద పిల్లలకు అన్యాయం జరుగుతుందనే వాదన వినపడుతోంది. ఆన్లైన్ తరగతులు ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ చాలా పరిమితంగా జరుగుతున్నాయి. శూన్య విద్యాసంవత్సరం అవుతుందనే ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. అయితే పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రతి పిల్లవాడికి చేతులకు గ్లౌజులు ఇవ్వడం, రన్నింగ్ వాటర్, శానిటైజర్లు, సబ్బు వంటి ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయలేదు. పాఠశాల అభివృద్ధి నిధుల నుంచి ఖర్చు చేసుకోవాలని చెప్పింది. అరకొర సౌకర్యాలతో నడిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. చదువులు సంగతి వెనక్కు పోయి, పిల్లలకు రక్షణ లేక కరోనా బారిన పడుతున్నారనే అంశం ముందుకొస్తుంది. పాఠశాలలు ప్రారంభం వల్ల కరోనా కేసులు ఎక్కువయ్యాయని ఢిల్లీల్లో మరలా బడులు మూసేశారు. జాగ్రత్తలు లేకపోతే రాష్ట్రంలో కూడా ప్రమాదకరంగా మారి విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడే ప్రమాదం ఉంది.
ప్ర : ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి.?
జ : రాష్ట్రంలో పాఠశాల వ్యవస్థ చాలా బలహీనం. కిక్కిరిసిన గదులు, తక్కువ గదుల్లోనే తరగతులు నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించడం ప్రధాన సమస్యగా మారుతుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించి ఆరోగ్యశాఖ నుంచి నివేదికలు తెప్పించుకోవాలి. కరోనా ఎక్కువగా ఉన్న చోట తరగతులు నిర్వహించకూడదు. ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకోవడం ముఖ్యమైన అంశం. ప్రతి రోజు పాఠశాలలు, కళాశాలలను సందర్శించేలా వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలి. ప్రతి పిల్లవాడి ఆరోగ్యం, అతని ఇంటి పరిసరాల్లో కరోనా కేసులు ఉన్నాయా అనే లెక్కలను తీసుకొని, ఆ పిల్లలను బడికి రాకుండా చూడాలి. పిల్లల హాజరుపై ఉపాధ్యాయులను విద్యాశాఖ ఒత్తిడి చేయకూడదు. పిల్లలకు ఉన్న వెసులుబాటు ఉపాధ్యాయులకు కూడా కల్పించాలి. కరోనా కాలంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహించడం కష్టం. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. లేదంటే విద్యావాలంటీర్లను నియమించాలి.
ప్ర : ఇప్పటికే సగం విద్యాసంవత్సరం పూర్తయింది. సిలబస్ పూర్తికాలేదు. విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది కదా.?
జ : వచ్చే విద్యాసంవత్సరం మొదటి రెండు, మూడు నెలల్లో మిగిలిన పాఠ్యాంశాలు పూర్తిచేసిన తరువాతే రెగ్యులర్ పాఠ్యాంశాలకు వెళ్లేలా అనుసంధాన తరగతులు ఏర్పాటు చేయాలి. గతంలో లాగా ఎక్కువ సిలబస్, ఎక్కువ పరీక్షలు పెట్టాలనుకోవడం సరికాదు. పిల్లలు ఇంటి దగ్గర వారికి వారే చదువుకునే పద్ధతుల్లో చదువులు ఉండాలి. అన్నీ బడిలోనే నేర్పడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఒక రోజు బడికి హాజరై రెండు రోజులు ఇంటిలో చదువుకునేలా ఉండాలి. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు జూన్లోనే విద్యార్థులకు అప్పగించినట్లయితే బాగుండేది. ఇలా చేయకపోవడం పెద్ద తప్పు. ఉపాధ్యాయులకు ఇతర పనులను తగ్గించి బోధన పనులు అప్పగిస్తే ఉన్న కొద్ది కాలంలోనే చదువు బాగా సాగుతుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశాలను పరిగణనలోకి తీసుకొని పరీక్షలను నిర్వహించాలి.
0 Response to "Health is more important than education"
Post a Comment