Primary school booming with rationalization
హేతుబద్థీకరణతో కుదేలౌతున్న ప్రాథమిక పాఠశాల
2015లో క్రమబద్ధీకరణ సందర్భంగా విద్యాశాఖ కొంచెం దృష్టిపెట్టి ఈ మార్పును అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. ఫలితంగా క్రమబద్ధీకరణ నిబంధనలు విద్యార్ధుల సంఖ్య పెరిగిన స్కూళ్ళకు, అక్కడి టీచర్లకు ప్రోత్సాహకరంగా ఉండాలన్న సూత్రప్రాయ నిర్ణయం జరిగింది. 80 మంది విద్యార్థులున్న స్కూళ్ళను మోడల్ స్కూళ్ళుగా పరిగణించి అయిదుగురు టీచర్లను కేటాయించే విధాన్నాన్ని అమలు చేశారు. ఒక్క టీచర్లనేగాక ఇలాంటి స్కూళ్ళకు నిధులు, భవనాల విషయంలోనూ ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని చూసి మిగిలిన స్కూళ్ళు కూడా కనీసం 40-50 మంది పిల్లలున్న స్కూళ్ళుగా మారతాయని ఆశించాం. దీనికి రాజకీయ సంకల్పం తోడయి ఉంటే అద్భుతమైన ఫలితాలు వచ్చేవి.
ఇప్పుడు విద్యాశాఖ ఈ విధానానికి స్వస్తి చెప్పింది. విద్యాహక్కు చట్టాన్ని ముందుకు తెచ్చి 1:30 నిష్పత్తి మాత్రమే తమకు ప్రమాణమని ప్రకటించింది. మోడల్ ప్రైమరీ స్కూళ్ళకు మంగళం పాడి, ఎక్కువ మంది పిల్లలుంటే ఎక్కువ టీచర్లుండే పద్ధతికి చట్టబద్ధత లేదు పొమ్మంది. దాంతో 10 మంది పిల్లలున్నా ఇద్దరు టీచర్లును కేటాయించాల్సి ఉంటుంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని అంటోంది. వినడానికిది బాగానే ఉన్నా ఉన్నా క్షేత్రస్థాయిలో జరిగేదేమిటి? పిల్లలు 60మంది ఉన్నా ఆరుగురు ఉన్నా ఇద్దరే టీచర్లు ఉంటారు. 80–-90 మంది విద్యార్థులున్న స్కూళ్ళ నుంచి 8- లేదా 9 మంది ఉన్న చోటకి టీచర్లు తరలిపోతారు. కష్టపడి పిల్లల్ని చేర్చినవారు హతాశులవుతారు. పిల్లలు పెరిగినా టీచర్లు ఎందుకు తగ్గారో తల్లిదండ్రులకూ అర్థంగాదు. మంచి బడికి మంగళంపాడి, మినుకు మినుకుమనే బడికి పట్టం గట్టడంగా ఇది మారుతుంది. దీని వల్ల చిన్న పాఠశాలలు మెరుగుపడతాయి అనొచ్చు. కానీ ప్రజలకు కావల్సింది, తరగతికొక టీచరున్న పెద్ద పాఠశాలలు. ఏం చేసినా చిన్న వాటిలో పిల్లలు చేరరు. కథ మళ్ళీ మొదటికొచ్చి టీచర్లు లేక పెద్ద పాఠశాలలు కూడా చిన్నవిగా మారతాయి. అన్నీ చిన్న స్కూళ్ళవుతాయి. టీచర్లు భారీగా మిగిలి పోతారు!
రేపు బదిలీల తర్వాత ఇప్పుడున్న 12వేల సెకండరీ గ్రేడు ఖాళీలు ఏ పాఠశాలలో ఉండబోతాయి అనేది చాలా పెద్ద ప్రశ్న. పిల్లలు లేని పాఠశాలల్ని టీచర్లు ఇష్టపడతారు. పెద్ద వాటిని కోరుకోరు. ఖాళీలన్నీ పెద్ద స్కూళ్ళలోనే మిగిలి పోతే సమస్య మరీ జటిలంగా మారుతుంది!
ప్రస్తుత క్రమబద్ధీకరణ వల్ల 7638 పాఠశాలలకు రెండో టీచరు వస్తాడు. ఎక్కువ పిల్లలున్న దాదాపు 5000 పాఠశాలల నుంచి టీచర్లు ఇతరచోట్లకు వెళ్లక తప్పదు. దీనివల్ల లాభపడే పిల్లల కంటే నష్టపడే పిల్లలు నాలుగైదు రెట్లుంటారు. ఒక్క కర్నూలు జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ సెకండరీగ్రేడు టీచర్లు 7545 మంది మిగులు తేలుతారు. ఎల్ ఎఫ్ ఎల్ పోస్టుల్ని కూడా కలుపుకుంటే ఈ మిగులు 13000ను మించిపోతుంది. ప్రస్తుతం 12512 సెకండరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏతావాతా తేలేదేమంటే. కొత్త నియామకాల అవసరమే దాదాపు ఉండదు. ఇదేనా ఈ కసరత్తు ఆంతర్యం?
మోడల్ ప్రైమరీ స్కూళ్ళను కొనసాగించడానికి వీలుగా, ఎక్కువ టీచర్లను కేటాయించడానికి పోస్టులెక్కడివి అనేది అధికారుల వాదన. పోస్టులు లేకుంటే మంజూరు చేయించుకోవాలి, అంతేగాని, పిల్లలు ఎందుకు నష్టపోవాలి? పోనీ ‘ఒక్క స్కూలునూ మూసెయ్యం, ఏ ఒక్క బడీ ఇక ఒక టీచరుతో నడవదు’ అంటున్న ప్రభుత్వం ‘ఒక్క పోస్టునూ రద్దు చెయ్యం, అన్ని పోస్టులూ భర్తీ చేసి తీరుతాం’ అని కూడా ప్రకటిస్తుందా? అలా చేస్తే మిగులు తేలిన సెకండరీ గ్రేడు, ఐఎఫ్ఎల్ పోస్టుల్ని మోడల్ ప్రైమరీ స్కూళ్ళకు, విద్యార్ధులు పెరిగిన స్కూళ్ళకు సర్దుబాటు చేయొచ్చు. ఇరవై మంది లోపు పిల్లలున్న బడులకు ఒక రెగ్యులర్ టీచరును, ఒక విద్యావలంటీరును ఇచ్చి మిగతా పోస్టుల్ని పెద్ద స్కూళ్ళకు కేటాయించవచ్చు. దీనిక్కావల్సింది కొంచెం మనసూ, ఇంకొంచెం సానుకూల ప్రజాస్వామిక దృక్పథమూ!
ఇక ఉపాధ్యాయులు, వాళ్ళ సంఘాలు కూడా క్రమబద్ధీకరణ కాలంలో లేదా బదిలీల సమయంలో మాత్రమే పాఠశాలల గురించి పట్టించుకోవడం కాకుండా దాన్ని ఎప్పుడు తమ ప్రధాన అజెండాలో భాగం చేసుకోవాలి. మొత్తం విద్యారంగానికి ప్రాథమిక పాఠశాలలే ఆయువు పట్టులాంటివి. అన్ని హంగులూ, అయిదుగురు టీచర్లూ అయిదు గదులూ ఉన్న మంచి పాఠశాల పంచాయితీకి ఒకటి ఉండి తీరాలి. తల్లిదండ్రుల ఆకాంక్షలూ, సామాజిక పరిస్థితిలూ తీవ్రంగా మారిపోతున్న వేళ దీన్ని గుర్తించి మన ప్రాథమిక పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాకుంటే వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని గుర్తించాలి. ఓ వైపు తల్లిదండ్రుల సాయంతో తమ బడిలో విద్యార్థుల్ని పెంచుకుంటూ, మరోవైపు దానిచుట్టూ ఓ సామాజికద్యమాన్ని నిర్మించకుంటే ఇలాంటి సవాళ్ళని ఎదుర్కొలేమన్న స్పృహనూ చైతన్యాన్ని పెంచుకోవాలి.
0 Response to "Primary school booming with rationalization"
Post a Comment