‘అమ్మఒడి’ అక్రమార్కులపై కొరడా
- క్రిమినల్ కేసుల నమోదుకు సర్కారు ఆదేశం
- నూతన మార్గదర్శకాలు జారీ
- అనాథ పిల్లల పేర్లతో బ్యాంకు ఖాతాలు
అమ్మఒడి పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కొరడా ఝులిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అర్హతలేని వారు లబ్ధి పొందితే బాధ్యులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్య డైరెక్టర్ చినవీరద్రుడు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు అప్రమత్తంగా వ్యవహరించి అర్హత లేని ఒక్కరికి కూడా లబ్ధి చేకూరకుండా చూడాలని అందులో ఆదేశించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిపొందినట్లు తేలితే సంబంధిత ఉద్యోగులకు జరిమానా విధించడంతోపాటు, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల్లో అక్రమాలు వెలుగు చూస్తే యాజయాన్యాలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
రెండో విడత జాబితా ప్రకటన
అమ్మఒడి కింద మరింత మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా పాఠశాల విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. తాజాగా రెండో విడత లబ్ధిదారుల జాబితాను కూడా ప్రకటించింది. అందులో అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలకు జనవరి 9న నేరుగా రూ. 15వేలు నగదు జమ కానుంది. అనర్హులుగా గుర్తించిన వారు అర్హత సాధించేందుకు సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి తమ అర్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. విత్హెల్డ్ జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలిసి సంబంధిత పత్రాలు అందజేసి అమ్మఒడి పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హత సాధించవచ్చు.
అనాధ పిల్లలకు బ్యాంకు ఖాతాలు
అనాథ విద్యార్థుల వివరాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్లో ఉంచినట్లు డీఈవో సుబ్బారావు తెలిసారు. వీటిని ప్రధానోపాధ్యాయులు పరిశీలించి విద్యార్థుల పేర్లతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అర్హులు జాబితాలోని తల్లుల బ్యాంకు ఖాతా నంబర్లు ఐఎ్ఫఎ్సఈ కోడ్లు, ఆధార్ నెంబర్లలో తప్పులు సరి చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు అవకాశం కల్పించారు. అమ్మఒడి అనర్హుల జాబితాలోని విద్యార్థుల తల్లులు తమ అర్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను గ్రామ సచివాలయంలో అందజేస్తే వాటిని పరిశీలించి అర్హుల జాబితాలోకి మార్చే బాధ్యత సచివాలయాల సిబ్బందిదని డీఈవో చెప్పారు.
0 Response to " "
Post a Comment