Another interesting development in AP panchayat elections .. this time a new 'NOTA'
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో మరో ఆసక్తికర పరిణామం .. ఈసారి కొత్తగా 'నోటా'
పల్లె పోరులో ఈసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇప్పటివరకూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో మాత్రమే కనిపించే 'నోటా' మొట్టమొదటిసారి పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో కూడా స్థానం దక్కించుకుంది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు మాత్రమే బ్యాలెట్ పత్రంలో ముద్రిస్తారు. ఈ బ్యాలెట్ పత్రంలో గుర్తులన్నింటి కంటే చివరన 'నోటా'ను కూడా చేర్చడం విశేషం. సాధారణంగా పంచాయతీ ఎన్నికల కోసం పదహారు గుర్తులతో బ్యాలెట్ పేపర్లు ముద్రిస్తారు. ఈ విధంగా ముద్రించిన బ్యాలెట్లో అట్టడుగున 'నోటా'కు చోటిచ్చారు.
పోటీలో ఉన్న ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు వేసుకోవచ్చు.
అయితే, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లకు అంత ప్రాముఖ్యం దక్కదు. 'నోటా'కు పడిన ఓట్ల కంటే అభ్యర్థులకు పోలైన ఓట్లు చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల నోటాకు పోలైన ఓట్లు కీలకంగా మారిన సందర్భాలు చాలా తక్కువ. కానీ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితి అలా ఉండదు. పల్లె పోరులో ఒక్క ఓటు కూడా కీలకమే. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్, వార్డు సభ్యులు గెలుపొందిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'నోటా' అత్యంత కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఏపీలో నామినేషన్ల కోలాహలం మొదలైంది. ఫిబ్రవరి 9వ తేదీన 12 జిల్లాల్లో 18 డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. చిత్తూరు, రాజంపేట, కడప, జమ్మలమడుగు, కదిరి, కర్నూలు, నంద్యాల, కావలి, ఒంగోలు, తెనాలి, విజయవాడ, నరసాపురం, పెద్దాపురం, కాకినాడ, అనకాపల్లి, పాలకొండ, టెక్కలి, శ్రీకాకుళం డివిజన్లలో ఫిబ్రవరి 9న పోలింగ్ జరగనుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.3 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంది. అదే విధంగా వార్డు సభ్యత్వాలకు పోటీపడేవారు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు రూ.1500, మెంబర్ అభ్యర్థులు రూ.500 డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఫిబ్రవరి 9న మధ్యాహ్నం 3.30కు పోలింగ్ ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆరోజే ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్ ఎంపికకు ఓటింగ్ నిర్వహిస్తారు.
0 Response to "Another interesting development in AP panchayat elections .. this time a new 'NOTA'"
Post a Comment