AP Teachers Transfers 2021
ఇంకెంతమంది ఉన్నారో..!
ఉపాధ్యాయుల బదిలీలపైమరింత లోతుగా విచారణ
బదిలీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా స్థానాలు ఎంచుకోవడంతో వారిపై చర్యలు చేపట్టిన విద్యాశాఖ మరింత లోతుగా విచారణ చేపట్టింది. ఇలాంటి వారు ఇంకా ఉంటారన్న అనుమానాలు ఉపాధ్యాయులనుంచి వ్యక్తమవుతుండడంతో ఉన్నతాధికారులు ఆదిశగా చర్యలు చేపట్టారు. జిల్లాలో బదిలీ అయిన ఉపాధ్యాయులు, వారు ఎంచుకున్న ఐచ్ఛికాలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
జిల్లావ్యాప్తంగా ఇటీవల రెండువేలమంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగింది. బదిలీల్లో ప్రదేశాల ఎంపికలో స్పౌస్ కోటా కింద ప్రత్యేక మార్గదర్శకాలు ఉంటాయి. దీని కింద నిబంధనల ప్రకారం భార్యా, భర్తలు సమీపంలోని పాఠశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు అలా పనిచేసే ప్రదేశానికి సమీపంలో ఉండే పాఠశాలలను ఎంపిక చేసుకోకుండా వారి నివాసప్రాంతానికి సమీపంలోనో లేదా తమకు అనువుగా ఉన్న ప్రాంతాలనో ఎన్నుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా తమకు నచ్చిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలని అడ్డదారులు తొక్కారు. వారంతా బదిలీ అయిన ప్రదేశాల్లో విధులు చేరిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం బయట పడింది. ఇప్పటివరకు పలువురు ఉపాధ్యాయులను గుర్తించి సస్పెండ్ చేశారు.
పర్యవేక్షణలోపమా?
ఉపాధ్యాయులు తమకు నచ్చిన ప్రదేశాన్ని కోరుకోవడం లేక ఉన్న ప్రదేశం అందుబాటులో ఉంటే దాన్ని దాటి బయటకు వెళ్లకుండా ఉండటం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. పెడన పురపాలక సంఘంతో పాటు, మచిలీపట్నం, విజయవాడ నగరపాలకసంస్థల పరిధిలోని కొన్ని పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తాము పురపాలకసంఘ పరిధిలో ఉన్నామని, తాము పనిచేసే ప్రదేశాలు నగరపాలక సంస్థలో విలీనం అవుతున్నాయని న్యాయస్థానాలను ఆశ్రయించి స్టేలు తెచ్చుకుని బదిలీ కాకుండా ఉండిపోయారు. తాత్కాలికంగా బదిలీ కాకుండా ఉంటే తరువాత ఎవరో ఒకరిని పట్టుకుని ఇంటికి దగ్గర ప్రాంతాల్లో చేరిపోవచ్చని ఇలా చేస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా ఉపాధ్యాయ వర్గాలనుంచే వినిపిస్తున్నాయి. వీటికి విధానపరమైన నిర్ణయాలు కొంత కారణం అవుతుంటే మరికొన్నింటికి పర్యవేక్షణ లోపంగా కనిపిస్తుంది. స్పౌస్ కోటాలో వారికున్న అవకాశాన్ని దుర్వినియోగం జరిగినట్లు తోటి ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసేదాకా జిల్లా అధికారులకు తెలియలేదు. దీనిపై అధికారుల పర్యవేక్షణలేక పోవడమే కారణమని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు తమ లాగిన్ నుంచే బదిలీ ఆప్షన్లు ఎంచుకుంటారు. ఇది హెచ్ఎంలు, ఎమ్యీవోలకు తెలియదు. దీంతో వారి పర్యవేక్షణ లేకుండా పోయింది. అందుకే ఐచ్ఛికాల ఎంపికలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయన్న విషయంలో జీవోలో స్పష్టం చేశారు. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఇలాంటి అవకతవకలు జరిగేవి కావని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు.
పూర్తి స్థాయి విచారణ
స్పౌస్ కోటాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులు అందరిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే తొమ్మిదిమందిని సస్పెండ్ చేశాం. మరింత లోతుగా పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నాం. ఇంకా ఎవరైనా అలాంటివారు ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా బదిలీలు నిర్వహించాం. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ జీవోలపై అవగాహన పెంచుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
రాజ్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి
®️
0 Response to "AP Teachers Transfers 2021"
Post a Comment