Starting with Dussehra .. ending with Sankranthi ..!
దసరాతో మొదలై.. సంక్రాంతికి ముగిసి..!
ఉపాధ్యాయ బదిలీలు దాదాపు పూర్తి..
జాయినింగ్ రిపోర్ట్ను అందిస్తున్న ఎమ్యీవో
బదిలీల కోసం ఏడాది కాలంగా నిరీక్షిస్తున్న ఉపాధ్యాయుల ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. అన్ని క్యాడర్లలో దాదాపు ప్రక్రియ పూర్తి అయ్యింది. దీంతో జిల్లా వ్యాప్తంగా తప్పనిసరి బదిలీ కావాల్సిన 1152 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఈ ఏడాది బదిలీల ప్రక్రియ గతంలో ఎన్నడూ లేనంతగా ఆందోళనలు, ధర్నాలు, ముట్టడుల నడుమ కొనసాగింది. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో, సవరణ ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయోనని ఉత్కంఠ కనిపించింది. దీంతో ఉపాధ్యాయులు సైతం కొంత ఆందోళన చెందారు.
సుదీర్ఘంగా కొనసాగిన ప్రక్రియ.. సాధారణంగా అన్ని శాఖల బదిలీలు 1, 2 రోజుల్లోనే ముగుస్తాయి. కానీ ఉపాధ్యాయ బదిలీలు అనగానే ముందుగా హేతుబద్ధీకరణ చేపట్టిన తర్వాతే అసలు ప్రక్రియ మొదలవుతుంది. దీంతో ఇక్కడే చిక్కుముడి పడుతోంది. ఈసారి బదిలీల ప్రక్రియలో మొదట జాప్యానికి కారణం హేతుబద్ధీకరణ విధానం. కటాఫ్ డేట్ తర్వాత సంఘాల విన్నపాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఆగస్టులో ప్రారంభమైన ప్రాథమిక ప్రక్రియ, జనవరి 15వ తేదీ వరకు అంటే సుమారు అయిదు నెలలకు బదిలీలు పూర్తయ్యాయి.
వీటిపైనే వ్యతిరేకత..
మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల పాఠశాలు మూత పడకూదనే ఉద్దేశంతో 40 శాతం నుంచి 50 శాతం వరకు పాఠశాలల్లోని పోస్టులను అధికారులు బ్లాక్ చేశారు. దీంతో సీనియర్లు మంచి ప్రదేశాలు కోల్పోతామనే భావనతో బ్లాకింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా 2015లో బదిలీల్లో ఎదురైన చేదు అనుభవాలతో వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వద్దని, మాన్యువల్ విధానాన్ని తీసుకురావాలని పట్టుబట్టారు. అయితే ఉపాధ్యాయులందరూ సాంకేతికను అందిపుచుకోవాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ కమిషనరు వి.చినవీరభద్రుడు నూతన విధానాన్ని కొనసాగించారు. మొదట్లో సర్వర్ మోరాయిండంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.*
వెబ్ కౌన్సెలింగ్ విజయవంతం..
సంఘాలు, ఉపాధ్యాయులు వెబ్ కౌన్సెలింగ్ను ఎంతగా వ్యతిరేకించినప్పటికీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కమిషన్ నూతన విధానంలో ప్రక్రియ పూర్తి చేసి విజయవంతమయ్యారనే చెప్పాలి. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లలో 97 శాతం మంది పైగా వెబ్ విధానంపై సంతృప్తి చెందితే, ఎస్జీటీలలో 95శాతం మందికి పైగా తాము కోరుకున్న ప్రదేశాలకే బదిలీ అయ్యామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయులు వెబ్కౌన్సెలింగ్కు అలవాటు పడాలని సంఘ నాయకులు అంటున్నారు.
మిగిలింది వీరే..
కోర్టు ఉత్తర్వులు రీత్యా గ్రేడ్-2 హెచ్ఎం, తెలుగు, హిందీ పండిట్లకు ఈ నెల 22నుంచి 26 వరకు వెబ్ ఐచ్ఛికాలు ఇచ్చుకోవాల్సి ఉంది. దీంతో వీరికి మాత్రమే బదిలీల ప్రక్రియ మిగిలి ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాది పదోన్నతి పొందిన తెలుగు, హిందీ పండిట్లు అదేస్థానంలో కొనసాగడం వల్ల సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతున్నారని పలువురు కోర్టుకు వెళ్లారు. దీంతో తిరిగి మరోసారి వెబ్విధానంలో ఐచ్ఛికాలు ఎంచుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక విధానం ఉండాలి..
బదిలీలకు సంబంధించి ఒక విధానం రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. బదీలీలు చేయడం, పదోన్నతులు కల్పించడం, మిగిలిన పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం ఇలా చేసుకుంటూ వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. - మద్ది బాబూరాజేంద్రప్రసాద్, ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు
ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు..
గతంలో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు సీనియార్టీ, జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే తాత్కాలికంగా కౌన్సెలింగ్ నిర్వహించాం. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మళ్లీ బదీలీలకు సంబంధించి ఐచ్చికాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ నిర్వహించడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాం. - రాజ్యలక్ష్మి, డీఈవో
0 Response to "Starting with Dussehra .. ending with Sankranthi ..!"
Post a Comment