What happens if iAS is blamed?
IAS లను అభిశంసిస్తే ఏమవుతుంది?
సెంట్రల్ డిప్యుటేషన్కు..
ఏడాదిపాటు అవకాశం ఉండదు
పదోన్నతులకూ ఇబ్బందే
ఎస్ఈసీ ‘అభిశంసన’ రద్దు తేలిక్కాదు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అదే శాఖ కమిషనర్ గిరిజాశంకర్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని అభిశంసించింది. అభిశంసన (సెన్ష్యూర్) అనేది అవార్డు కాదు. పక్కా పనిష్మెంట్. హెచ్చరిక (వార్నింగ్), అభిశంసన చాలా చిన్న పనిష్మెంట్లు.. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారా అని సందేహం రావొచ్చు. చూడడానికి ఇది చిన్నదే కావొచ్చు. కానీ ఐఏఎ్సల విషయంలో మాత్రం పెద్ద ప్రభావమే చూపిస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తప్పుచేస్తే వారికి సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్-1965లోని ‘రూల్ 11 (2) పెనాల్టీస్’ కింద శిక్షలు ఖరారు చేస్తారు. అభిశంసన అన్నది అందులో ఒకటి. ఉద్యోగి లేదా అధికారి ఏదైనా తప్పిదం చేసినప్పుడు.. సహేతుక కారణాలను స్పష్టంగా వివరిస్తూ.. తప్పుచేశారని బహిరంగంగా బహిరంగంగా తెలియజేయడానికే ఈ శిక్ష విధిస్తారు. దీనిని సదరు అధికారి పనితీరును తెలియజేసే వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)లో పొందుపరుస్తారు. దీని ప్రభావంతో ఆరు నెలల నుంచి కనీసం ఏడాదిపాటు పదోన్నతులు పొందలేరు. ఇతర కీలక పదోన్నతులు, పోస్టింగ్లు పొందే సమయంలో దీనిని పరిగణనలోకి తీసుకుంటారు.
సాధారణంగా.. మాట వినలేదని, క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డారన్న అభియోగాలపై పోలీసు, రెవెన్యూ, ఇతర విభాగాల ఉద్యోగులు, అధికారులకు ఇలాంటి శిక్షలు ఎక్కువగా విధిస్తుంటారు. ఐఏఎ్సలు, అందులోనూ సీనియర్ అధికారులకు ఇవ్వడం చాలా అరుదు. ఇప్పుడు ఎన్నికల కమిషనర్.. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్లను అభిశంసించారు. ఈ నేపథ్యంలో వీరి విషయంలో ఏమవుతుందన్న చర్చ జరుగుతోంది. ఇది వారి సర్వీసు రిజిస్టర్లో నమోదవుతుంది. కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్, ఇతర పదోన్నతులు పొందే సమయంలో కేంద్ర సిబ్బంది-శిక్షణ విభాగం (డీవోపీటీ) ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ పనిష్మెంట్ అమల్లో ఉండగా ఏడాదిపాటు సెంట్రల్ డిప్యుటేషన్ ఇవ్వరు. ఇది పదోన్నతులకూ అడ్డు వస్తుంది. చండీగఢ్లో ఇద్దరు ఐఏఎ్సలను ఇలాగే అభిశంసించారు. పంజాబ్లో ఓ రాష్ట్ర స్థాయి అధికారికి ఐఏఎస్ పదోన్నోతి ఇచ్చేందుకు డీవోపీటీకి ఆయన పేరు పంపించారు. అయితే ఆ అధికారిని గతంలో రాష్ట్ర స్థాయిలోఅభిశంసించారు. ఈ కారణంగా ఆయన ఐఏఎస్ పదోన్నతికి అనర్హుడని డీవోపీటీ తేల్చేసింది.
ద్వివేదికి ఇంకా మూడేళ్లు..
ద్వివేదికి ఇంకా మూడేళ్ల సర్వీసు ఉంది. అభిశంసనను ఆయన సర్వీసు రికార్డులో నమోదు చేస్తే సెంట్రల్ డిప్యుటేషన్ పొందడం అసాధ్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. గిరిజా శంకర్కు ఎక్కువ సర్వీసు ఉన్నా.. భవిష్యత్ పదోన్నతులపై ప్రభావం చూపించనుంది. సాధారణంగా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఇచ్చే పనిష్మెంట్లను కోర్టులో సవాల్ చేసుకోవచ్చు. కానీ అఖిల భారత సర్వీసు అధికారుల విషయంలో అది సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఈసీ వంటి రాజ్యాంగ సంస్థ ఇచ్చిన పనిష్మెంట్ ప్రభావం సర్వీసు అంతా ఉంటుందని అంటున్నాయి. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం దీనిని తొలగించేద్దామని అనుకున్నా అదంత తేలిక్కాదు. మళ్లీ డీవోపీటీకి వెళ్లాలి. అక్కడ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తొలగించాలా.. వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారు. ఎస్ఈసీ ఇచ్చిన పనిష్మెంట్ను అంత సులభంగా తొలగించిన దాఖలాలు ఇప్పటిదాకా లేవని అధికార వర్గాలే చెబుతున్నాయి.
0 Response to "What happens if iAS is blamed?"
Post a Comment