E-SR This is an endless story
E-SR ఇది అంతులేని కథ
ఏడాదిగా డెడ్ లైన్ల పొడగింపు
సర్వర్ పనిచేయక అవస్థలు
ఇప్పటికి 25 శాతమే పూర్తి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్ చేసేందుకు ప్రారంభించిన ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్(ఈ-ఎస్సార్) నమోదు ఒక అంతులేని కథలా మారింది. దాదాపు ఏడాది కాలంగా డెడ్లైన్లు పొడిగించుకుంటూ వస్తున్నా.. నేటికీ 25 శాతానికి మించి పూర్తి కాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, ఇతర అన్ని లావాదేవీలను ఒకే గొడుగు కింద నిర్వహించేందుకు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టం(సీఎస్ఎంఎస్)ను ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉద్యోగులందరూ ఈఎస్సార్ ను నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ దాదాపు ఏడాది క్రితమే ప్రారంభమైనప్పటికీ.. ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లు సాగుతూనే వస్తోంది
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉద్యోగుల సర్వీస్ సెలవులు, ఇంక్రిమెంట్లు, వ్యక్తిగత సమాచారం తదితర 11 రకాల అంశాలను ఆన్ లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ప్రత్యేకవెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది. గతేడాది కరోనా కారణంగా తీవ్ర జాప్యం జరగగా.. అలా ప్రక్రియలు ప్రారంభమైన తర్వాత కూడా సర్వర్ పని చేయకపోవడం, ఉద్యోగులు నమోదు చేయాల్సిన అంశాలు ఎక్కువగా ఉండటం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో అన్ని అంశాలను పూర్తిగా నమోదు చేసిన వారి సంఖ్య 25 శాతంలోపుగానే ఉంది. ఈనేపథ్యంలో ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఈ ఎస్సార్ నమోదు గడువును మరింత పొడిగించడంతోపాటు, అనవసరమైన అంశాలను తగ్గించాలని కోరుతున్నాయి
మూలాలు గుర్తించరా
రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకు సర్వీసుపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచన్గా వేతనాలు జారీ చేయడం, ఉద్యోగ విరమణ సమయంలో అన్ని రకాల బెనిఫిట్స్ అందించేలా ఈ-ఎస్సార్ ఉపయోపడుతుంది. అందుకోసం రాష్ట్రంలోని ఐదు లక్షల 77 వేల మందికిపైగా ఉద్యోగులు అధికారుల వివరాలను ఈ ఎస్సార్ లో నమోదు చేయాలని ఆదేశించింది. అయితే ఈ-ఎస్సార్ నమోదు పూర్తి కాకపోవడంతో డెడ్ లైన్లు అయితే పొడిగిస్తున్నారు కానీ సమస్య మూలాలను మాత్రం గుర్తించడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు అవసరం లేని అంశాలను తొలగించాలని, సర్వర్ వేగం పెంచి, ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి, సర్వీస్ రిక్వెను త్వరితగతిన పరిష్కరించే వ్యవస్థను తీసుకురావాలని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ కోరారు.
డేటా లేని బయోమెట్రిక్
ఈ-ఎస్సార్ సమస్య అలా ఉంటే.. ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ వ్యవస్థ పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్రంలోని పాఠశాలల్లోని బయోమెట్రిక్ యంత్రాలకు డేటా చార్జీలను విద్యాశాఖ మంజూరు చేయడం లేదు దీంతో కొంత కాలం పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆ ఖర్చు భరించినా.. తర్వాత్తర్వాతతమకెందుకులే అన్నట్లు ఊరుకుంటున్నారు. దీంతో ఎవరికి వారు తమ సెల్ ఫోన్స్ లో హాట్ స్పాట్ ఆన్ చేసుకుని వేలిముద్ర వేసి, తమ పనులు చూసుకుంటున్నారు. అందువల్ల హాజరు ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతోపాటు, సిగ్నళ్లు లేని ప్రాంతాల్లో గంటల తరబడి నిరీక్షించాల్సివస్తోంది. విద్యావ్యవస్థను బాగు చేసేందుకు ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులను కేటాయిస్తూ.. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటం విమర్శలకు కారణమవుతోంది. విద్యాశాఖ ఇకనైనా స్పందించి బయోమెట్రిక్ యంత్రాలకు డేటా చార్జీలు మంజూరు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చేబ్రోలు శరత్ చంద్ర, పర్రె వెంకటరావు విజ్ఞప్తి చేశారు.
0 Response to "E-SR This is an endless story"
Post a Comment