Teacher vacancies in public schools in the state
14,061 ఎస్జీటీ పోస్టులు ఖాళీ
లెక్కతేల్చిన విద్యాశాఖ
నిరుద్యోగుల్లో డిఎస్సీపై ఆశ
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు
పోస్టులపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వానికి తెలిపింది. వీటిల్లో 14,061 ఎస్జిటి పోస్టులు ఉన్నట్లు విద్యాశాఖ లెక్క తేల్చింది. జిల్లాల వారీగా ఉన్న ఖాళీ పోస్టుల జాబితాను కూడా ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఆరు జిల్లాల్లో వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని జిల్లాల కంటే చిత్తూరులో ఎక్కువగా 2,552 పోస్టులు, తక్కువగా అనంతపురం జిల్లాలో 467 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల వద్ద పెండింగ్లో ఉంది. ఈ రెండు శాఖల నుంచి అనుమతి రాగానే పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్ సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల టెట్ నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో డిఎస్ సి పై ఆశ నెలకొంది. ఇటీవల ఉపాధ్యాయ బదిలీల్లో టీచర్ల సర్దుబాటుతో పెద్దఎత్తున ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పడ్డాయి. మరోపక్క ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు పాఠశాలల్లో లేకపోవడంతో బోధన కుంటుపడుతోంది. రానున్న రెండేళ్లలో సుమారు 7,500 ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని, అవసరం మేరకు టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని వైసిపి తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. రెండేళ్లు గడుస్తున్నా డిఎస్సి నోటిఫికేషన్ ఊసే లేదు. గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్ సి -2018లో నోటిఫై చేసిన పోస్టులనే ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. టెట్ నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వడం, పోస్టుల ఖాళీలను తేల్చడంతో త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందనే ఆశ నిరుద్యోగుల్లో వ్యక్తమవుతుంది.
0 Response to "Teacher vacancies in public schools in the state"
Post a Comment