The year the first corona case was registered in the state
తగ్గినట్టే తగ్గి విజృంభణ!
- రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదై ఏడాది
- 2020 మార్చి 12న నెల్లూరు వాసికి పాజిటివ్
- ఒక దశలో రోజుకు 10 వేలకుపైగా కేసులు
- సరిగ్గా ఏడాది తర్వాత 210 కేసులు నమోదు
- 60 రోజుల తర్వాత ఒక్కరోజులోనే అత్యధికం
- కరోనా సెకండ్ వేవ్ సూచనలతో ఆందోళన
సరిగ్గా ఏడాది కిందట... మార్చి 12 అర్ధరాత్రి... పుణెలోని వైరాలజీ ల్యాబ్ నుంచి రాష్ట్రానికి ఒక నివేదిక వచ్చింది. దానికోసం ఆరోగ్యశాఖ అధికారులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అప్పటికే దేశంలో కరోనా ప్రభావం మొదలైంది. రాష్ట్రంలోకి కూడా కొవిడ్ ప్రవేశిస్తుందా అన్న అనుమానాలతో సతమతమవుతున్న సమయం అది. అప్పటికే కొంతమంది రిపోర్టులు నెగటివ్ వచ్చాయి. ఆ రోజు వచ్చిన నివేదికలో కూడా నెగటివ్ ఉండాలని అధికారులు కోరుకున్నా ఫలితం తారుమారైంది. మార్చి 12న నెల్లూరులో తొలి కేసు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కరోనా ప్రవేశించినట్లయింది. ఆ తర్వాత కూడా ఏపీలో పెద్దగా కేసులు నమోదయ్యే అవకాశం లేదని అధికారులకు ఎక్కడో చిన్న ఆశ. దానికి తగ్గట్టే 13 నుంచి 18వరకూ ఒక్క కేసు కూడా రాలేదు. 19న ప్రకాశం జిల్లాలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. మూడో కేసు విశాఖలో, నాలుగో కేసు రాజమహేంద్రవరంలో, ఐదో కేసు విజయవాడలో నమోదయినట్లు ఆరోగ్యశాఖ నిర్ధారించింది. 2020 మార్చి 21 తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఒక దశలో రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
🌷అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందనుకునేలోగా మరోసారి విజృంభించే సూచనలు కనిపిస్తున్నా యి. మంగళవారం 118 కేసులు, బుధవారం 120, గురువారం 174 కేసులు నమోదవగా శుక్రవారం వీటి సంఖ్య ఏకంగా 210కి పెరిగిపోయింది. జనవరి 12న రాష్ట్రంలో 203 కేసులు వచ్చిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో పాజిటివ్లు వెలుగు చూశాయి. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో తొలి కేసు నమోదైన రోజే సెకండ్ వేవ్ సూచనలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల నమోదులో దేశంలోనే ఏపీ రెండో స్థానంలోకి వెళ్లింది. రాష్ట్రంలో 8,91,388 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకూ 7,180 మంది బలయ్యారు. మొదటి వేవ్లోనే ఈ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. ఇక సెకండ్ వేవ్ గురించి ఇంకా ఏమీ తెలియని పరిస్థితి. తొలిదశలో వచ్చిన కరోనా స్ట్రెయిన్, రెండోదశలో వచ్చే స్ట్రెయిన్ ఒకటేనా, కాదా అనే అంశాన్ని వైద్యులు సహా ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకూ లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. తాజాగా తూర్పుగోదావరిలో 41, గుంటూరు 18, విశాఖ 16, కృష్ణా 14, అనంతపురం జిల్లాలో 12 చొప్పున కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 8,91,388 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 8,82,981 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 7,180కి పెరిగాయి. ప్రస్తుతం అన్ని జిల్లాలో కలిపి 1,227 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
0 Response to "The year the first corona case was registered in the state"
Post a Comment