Government focus on flu sufferers
జ్వర పీడితులపై ప్రభుత్వం దృష్టి
నేటి నుండి ఇంటింటి సర్వే
వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సింఘాల్
రాష్ట్రంలో జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించడం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్వర పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేయాలని సూచించినట్లు తెలిపారు. దీనివల్ల కరోనా కట్టడి చేయడమే గాక, ఆసుపత్రులపై ఒత్తిడి కూడా తగ్గుతుందన్నారు.
గడిచిన 24 గంటల్లో కేంద్రం నుండి ఎపికి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందిందని వెల్లడించారు. మరో మూడు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందని వివరించారు. గడిచిన 24గంటల్లో 4,306 మంది డిశ్చార్జి అయ్యారని, 5,523 మంది ఆసుపత్రుల్లో చేరారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 6,453 ఐసియు బెడ్లు ఉండగా 6,006 రోగులతో నిండాయన్నారు. 447 బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 23,204 ఆక్సిజన్ బెడ్లు రాష్ట్రంలో ఉండగా, 22,029 బెడ్లు కరోనా బాధితులతో నిండి ఉన్నాయని, కోవిడ్ కేర్ సెంటర్లలో 16,597 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
0 Response to "Government focus on flu sufferers"
Post a Comment