Postponement of inter examinations
ఇంటర్ పరీక్షలు వాయిదా
- తల్లిదండ్రుల ఆందోళన, కోర్టు వ్యాఖ్యలతో
- ఎట్టకేలకు పట్టు సడలించిన రాష్ట్ర సర్కారు
- పరీక్షల రద్దుకు మాత్రం ససేమిరా
- పరిస్థితులు చక్కబడ్డాక కొత్త తేదీలు
- విద్యా మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడి
- జూనియర్ కాలేజీలకు సెలవులు
పరీక్షలపై మొండి పట్టుపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చింది. ఓవైపు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన, మరోవైపు హైకోర్టు సూచనలతో ఇంటర్మీడియెట్ పరీక్షలు వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 5 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతటి కొవిడ్ ఉధృతిలోనూ పరీక్షలు నిర్వహించాల్సిందేనన్న ప్రభుత్వ వైఖరి ఎలా పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతోందనేది ‘పరీక్షలా.. ప్రాణాలా?’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంటర్ పరీక్షలు వాయిదా లేక రద్దు చేయాలంటూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొందరు నిరాహార దీక్షనూ చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కితగ్గింది. అదే సమయంలో పరీక్షలు రద్దు మాత్రం చేయట్లేదని, పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త తేదీలు ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
‘‘పిల్లల ప్రాణాలపైనా, వారి భవిష్యత్తుపైనా మమకారం ఉన్న ప్రభుత్వంగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశాం. అయితే దేశంలో, రాష్ట్రంలో పెరిగిపోతున్న కొవిడ్ కేసులు, దీనిపై వస్తున్న వార్తల పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నాం’’ అని మంత్రి వెల్లడించారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త తేదీలు ప్రకటిస్తామని, ఇదే విషయాన్ని సోమవారం కోర్టుకు కూడా వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇంటర్ తర్వాత పైచదువుల కోసం రాసే పరీక్షల్లో ఇంటర్ మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ మార్కులే వారి పైచదువులకు, ఉద్యోగాలకు కీలకం. అందుకే మన పిల్లల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించాలని ఈ ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడింది’ అని ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
జూనియర్ కాలేజీలకు సెలవులు
ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన నేపథ్యంలో నేటి నుంచి అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. తిరిగి పరీక్షల తేదీలు ప్రకటించే వరకూ కాలేజీలకు సెలవులు ఉంటాయని తెలిపింది. అలాగే విద్యాశాఖ మంత్రి ప్రకటనకు అనుగుణంగా ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది
పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా
పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫు వాదనలు విన్న ధర్మాసనం రికార్డు చేసింది.
ఏపీ రాజధాని తరలింపు అంశంపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిపిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా వేసింది.
0 Response to "Postponement of inter examinations"
Post a Comment