Corona third stage from August!
ఆగస్టు నుంచి కరోనా మూడో దశ!
- సెప్టెంబరులో గరిష్ఠానికి
- ఎస్బీఐ రీసెర్చ్ అంచనా
భారత్లో కొవిడ్-19 మూడో దశ ఉద్ధృతి ఆగస్టు నుంచి ప్రారంభం కావొచ్చని, సెప్టెంబరులో అత్యంత తీవ్రం కావొచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత గణాంకాలను చూస్తే.. జులై రెండో వారానికి దేశవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య దాదాపు 10,000కు దిగిరావచ్చని పేర్కొంది. కొవిడ్ రెండో దశలో కేసుల గరిష్ఠ తీవ్రత మే 7న నమోదైందని వెల్లడించింది. ఆగస్టు ద్వితీయార్థం నుంచి కొవిడ్ కేసుల వ్యాప్తి మళ్లీ పెరగడం ప్రారంభం కావొచ్చని అభిప్రాయపడింది. ‘పూర్వ ధోరణుల’ ఆధారంగా ఈ అంచనాలను వెలువరించినట్లు నివేదిక స్పష్టం చేసింది. రెండో దశతో పోలిస్తే మూడో దశలో గరిష్ఠ కేసులు సగటున రెండింతలు లేదా 1.7 రెట్లు అధికంగా నమోదైనట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నట్లు వివరించింది. కొవిడ్ మూడో దశ కూడా రెండోదశ మాదిరే తీవ్రంగా ఉన్నా.. మరణాలు తక్కువగా ఉండొచ్చని పేర్కొంది.
రెండోదశతో కుటుంబ అప్పులు 37.3 శాతానికి
కొవిడ్ పరిణామాల ఫలితంగా దేశంలో అప్పుల పాలైన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కుటుంబాల అప్పులు జీడీపీలో 37.3 శాతానికి పెరిగాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. 2019-20లో జీడీపీలో కుటుంబ రుణాలు 32.5 శాతంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావాన్ని ఇది చూపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ నిష్పత్తి మరింత పెరగొచ్చని నివేదిక హెచ్చరించింది. 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు, 2020-21లో బ్యాంకు డిపాజిట్లు తగ్గి, వైద్య ఖర్చులు పెరగడంతో 2021-22లో కుటుంబ అప్పుల నిష్పత్తి మరింత పెరగొచ్చని ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు.
0 Response to "Corona third stage from August!"
Post a Comment