Exam gubs in secretariat employees
సచివాలయాల ఉద్యోగుల్లో పరీక్షల గుబులు
- నేడు సీఎంవోలో ఉన్నతస్థాయి సమావేశం
- ప్రొబేషన్ ఖరారుకు పరీక్షలపై స్పష్టత వచ్చే అవకాశం
ప్రొబేషన్ ఖరారు చేసేందుకు పరీక్షలు నిర్వహిస్తారా? ఎన్ని పరీక్షలు పెడతారు? రాయకపోతే ఏమవుతుంది? రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరిలో ప్రస్తుతం ఇవే ప్రశ్నలు. వీటిపై ఉద్యోగ సంఘాల నాయకులు రోజుకో రకంగా ప్రకటనలు చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.21 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 2021 అక్టోబరు 2 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి ప్రొబేషన్ ఖరారు చేసి శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలి. ఇందుకోసం క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టం (సీబీఏసీ) పేరుతో పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సన్నాహాలు చేస్తోంది. సంబంధిత ఉద్యోగులకు శాఖాపరమైన అంశాలపై ఉన్న అవగాహనను తెలుసుకునేందుకు మరో పరీక్ష నిర్వహించనున్నారు. వంద మార్కులకు రెండు పరీక్షలూ నిర్వహించి, ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికే ప్రొబేషన్ ఖరారు చేస్తారన్న ప్రచారంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రొబేషన్ ఖరారు చేసేందుకు ఇలాంటి పరీక్షలు ఉంటాయని నియామకాలప్పుడు ప్రస్తావించలేదని సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు అభ్యంతరం చెబుతున్నారు. ఈ పరీక్షలపై నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని, ఉత్తీర్ణులైతేనే ప్రొబేషన్ ఖరారు చేస్తామనడం సరికాదని వారు ముఖ్యమంత్రికి వినతిపత్రాలు పంపారు.
అధికారుల సమాలోచనలు
ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారుకు ఎలాంటి విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. రెండు దశల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మొదట ప్రతిపాదించింది. దీనిపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో పునఃపరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై సీఎం కార్యాలయ అధికారులతో సచివాలయాల శాఖ అధికారులు మంగళవారం సమావేశమవుతున్నారు. ప్రొబేషన్ ఖరారు చేసేందుకు ఒక పరీక్ష సరిపోతుందా? రెండూ నిర్వహించాలా? అనే విషయంలో ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
వాలంటీర్లకు వారంలో మూడుసార్లు బయోమెట్రిక్ హాజరు
గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా పని చేస్తున్న వాలంటీర్లకు వారంలో మూడు రోజులు (సోమ, బుధ, శుక్రవారాల్లో) బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుంది. ఇప్పటికే ఉన్న ఈ నిబంధనను ఆగస్టు 1 నుంచి కచ్చితంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు సంయుక్త కలెక్టర్లు.. సచివాలయాలను పర్యవేక్షించే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే గౌరవ వేతనం లెక్కించి చెల్లించనున్నారు.
శాఖాపరమైన పరీక్షలు సహజమే: సజ్జల
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తవుతున్నందున వారిని క్రమబద్ధీకరించేందుకు శాఖాపరమైన పరీక్ష అనేది సహజంగా నిర్వహించేదేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమకు కూడా ఇలాంటి పరీక్షలుంటాయని ఐఏఎస్ అధికారులే చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అర్హత పరీక్షలపై నెలకొన్న గందరగోళంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా స్పందించారు. ‘ఈ శాఖాపరమైన పరీక్షలో అర్హత సాధించనంత మాత్రాన సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఉద్యోగాలూ పోవు. ఈ పరీక్షలపై అపోహలు ఎందుకొచ్చాయో అర్థం కావడం లేదు. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందే ముఖ్యమంత్రి జగన్. వాటిలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఎలా కల్పించాలనేదే ఆయన ఆలోచన’ అని సజ్జల పేర్కొన్నారు.
0 Response to "Exam gubs in secretariat employees"
Post a Comment