Make capacity enhancements ..
సామర్థ్యం పెంచిసంసిద్ధులను చేసి..
- ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం
- ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళికపై మార్గదర్శకాలు విడుదల
విద్యా వ్యవస్థపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ కేసులు తగ్గడంతో వచ్చే నెలనుంచి తరగతులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే పాఠశాలల సంసిద్ధత, ప్రత్యామ్నాయ విద్యాప్రణాళిక అమలుపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సచివాలయాల స్థాయిలో ఇటీవల సమావేశాలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈనెల 15 నుంచి ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక అమలు చేయాలని ఆదేశిస్తూ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేక కథనం.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం
గురువారం నుంచి జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలో 4,821 పాఠశాలల్లో 6.76 లక్షలమంది విద్యార్థులు వివిధ తరగతులు చదువుతున్నారు. కొత్తగా పాఠశాలల్లో చేర్పించుకునే క్రమంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తొలిరోజు తమ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ప్రాథమిక విద్యను పూర్తి చేసిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారిని పైస్థాయి తరగతుల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ఇలా ఒక తరగతి నుంచి మరో తరగతిలో చేరే వారందరినీ పాఠశాలల్లో చేర్పించి డ్రాపవుట్ లేకుండా చూడాలని, దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే సమయంలో తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వర్క్బుక్స్ ప్రాక్టీస్ చేయించాలి
విద్యార్థులు వివిధ పాఠ్యాంశాలపై పట్టు సాధించడంతోపాటు సామర్థ్యం పెంపుదల చేసేందుకు నోటుబుక్స్ స్థానంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వర్క్బుక్స్ ప్రాక్టీసు చేయించాలి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆగస్టు 2 నుంచి 7వ తేదీ వరకు, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆగస్టు 4 నుంచి 31 వరకు ప్రాక్టీసు చేయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుని చేయించాలని సూచించారు. దీంతోపాటు పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేవరకు రేడియో, టీవీ పాఠాలు, అందుబాటులో ఉన్న మాధ్యమం ద్వారా బోధించే తరగతులకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం హాజరయ్యేలా ఉపాధ్యాయులు బాధ్యతతో కృషి చేయాలన్నారు. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ తగు చర్యలు తీసుకుంది.
27 నుంచి బేస్లైన్ పరీక్షలు
ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులందరికీ బేస్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. గతేడాది విద్యార్థి నేర్చుకున్న అంశాలపై ఈ పరీక్షలు జరుగుతాయి. తొలుత పరిమిత సంఖ్యలో పిల్లలను పాఠశాలకు పిలిపించి పరీక్షలు నిర్వహించాలని భావించినా తరువాత ప్రశ్నపత్రాలను ఇళ్లకే పంపించి రాయించాలని నిర్ణయించారు. విద్యార్థులు ప్రశ్నపత్రాలు అందుకున్న అనంతరం నిర్దేశించిన తేదీల్లోపు వారికి అనువైన సమయంలో పరీక్ష రాయాలి. అనంతరం జవాబు పత్రాలను తల్లిదండ్రుల ద్వారా తెప్పించుకుని ఈనెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీలోపు ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సి ఉంది.
ఆదేశాలు జారీ: యూవీ సుబ్బారావు, డీవైఈవో
ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళికపై తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో నిర్దేశించిన నిష్పత్తి ప్రకారం హాజరైన ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు అమలు చేసేలా కృషి చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా భాగస్వాములై సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం.
0 Response to "Make capacity enhancements .."
Post a Comment