Soon home survey on education conditions in the state
ఏం చదివారు? ఏం చదవాలనుకుంటున్నారు?
- రాష్ట్రంలో విద్య పరిస్థితులపై త్వరలో ఇంటింటి సర్వే
- 20 అంశాలతో సమాచార సేకరణ
రాష్ట్రంలో అక్షరాస్యత, విద్య పరిస్థితులను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా మంగళగిరి మండలంలోని కాజ, తాడేపల్లి పురపాలక సంఘంలో నిర్వహించారు. దీని ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలో వీటికి ఆమోదం లభించనుంది. ఈ-ప్రగతి, గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాల, ఉన్నత విద్యా శాఖల సహకారంతో ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను సిద్ధం చేశారు. కరోనా ప్రభావం తగ్గితే ఆగస్టు 15 తర్వాత నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లతో ట్యాబ్ల ద్వారా సర్వే చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. దీని పరిశీలన బాధ్యతలను ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అప్పగించనున్నారు.
కొత్త కోర్సుల రూపకల్పనకు అవసరమే
- ఇంటింటి సర్వేలో సుమారు 20 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. కుటుంబసభ్యుల అందరి వివరాలను తీసుకుంటారు.
- ఏం చదువుకున్నారు? ఎక్కడితో చదువు ఆపేశారు? అవకాశం ఉంటే మళ్లీ చదువు కొనసాగిస్తారా? చదవడం, రాయడం వచ్చా? అని పెద్దల వివరాలు సేకరిస్తారు. తద్వారా చదువులు మధ్యలో నిలిపివేయడానికి కారణాలు, అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
- పది, ఇంటర్ చదివే పిల్లలు ఉంటే వారు భవిష్యత్తులో ఏం చదవాలనుకుంటున్నారు? నైపుణ్య శిక్షణ అవసరమా? వంటి వివరాలను సేకరిస్తారు. దీంతో ఉన్నత విద్యలో తీసుకోవాల్సిన మార్పులపై స్పష్టత వస్తుందని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పిల్లలు ఏం చదవాలనుకుంటున్నారో తెలిస్తే అందుకు అనుగుణంగా కోర్సులను రూపొందించవచ్చని ఆలోచిస్తోంది.
- ఇప్పటి వరకు యువత ఉన్నత విద్యలో ఎలాంటి మార్పులు కోరుకుంటుందో తెలియడం లేదు. ఉన్నత విద్యాసంస్థలు తమకు తోచిన రీతిలో కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. వీటిలో కొన్నింటికి ఆదరణ లభించని నేపథ్యంలో వారి మనోభావాలు తెలిస్తే తదనుగుణంగా ముందుకెళ్లవచ్చని భావిస్తోంది.
- 18-23 వయసులో ఉన్న వారి విద్యార్హతలు ఎలా ఉన్నాయో విశ్లేషణ చేయనున్నారు.
0 Response to "Soon home survey on education conditions in the state"
Post a Comment