AP EAPSET Schedule Release.
ఏపీ ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల.
ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్) షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్ పరీక్షను ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీలలో, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యావిభాగం తెలిపింది. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష బాధ్యతలు కాకినాడ జేఎన్టీయూకు అప్పగించారు. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కరోనా వల్ల ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఈఏపీసెట్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే విద్యాకోర్సుల్లో ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ పరీక్షకు మొత్తం 2,59,564 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,75,796 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ను, 83,051 మంది అగ్రికల్చర్ స్ట్రీమ్ను ఎంపిక చేసుకున్నారు. మరో 717 మంది ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ విభాగాల రెండింటిని ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మెుత్తం 14 పరీక్షా జోన్లలో 120 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబోతున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీషు, తెలుగు మీడియంలలో ఉంటుందని, 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రంతో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
ఈ పరీక్షల నిమిత్తం 1000 మంది ఇన్విజిలేటర్లు, 200 మంది పరిశీలకులు, 120 మంది ప్రత్యేక పరిశీలకులు, చీఫ్ సూపరింటెండెంట్లుగా నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు. వీరికి అదనంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్ఆర్టీసీ, డీఎంఅండ్హెచ్వోలు, విద్యాసంస్థల అధికారులు సహకారం అందిస్తారని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి ఆగస్టు 25న ప్రాథమిక కీ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అలాగే అగ్రికల్చర్ విభాగానికి చెందిన ప్రాథమిక కీను సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
0 Response to "AP EAPSET Schedule Release."
Post a Comment