AP Inter Board Key Announcement.
ఏపీ ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన.
ఏపీలో కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్టియర్ విద్యార్థులందరినీ మినిమం పాస్ మార్కులతో సెకండియర్ లోకి ప్రమోట్ చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఇటీవల ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉన్న పలు సందేహాలను నివృత్తి చేస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రెగ్యులర్ సెకండియర్ (2020-2021) పూర్తి చేసిన విద్యార్థులకు..
- ఐపీఈ మార్చి 2021కు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు.. వారి ఫస్టియర్, సెకండియర్ మార్కులు పెంచుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు.
- ప్రాక్టికల్ మార్కులను పెంచుకోవడానికి మాత్రం అవకాశం లేదు.
- ఐపీఈ-మార్చి 2021 లేదా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఎందులో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు.
- ప్రైవేటు విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావచ్చు.
- హాజరు మినహాయింపు కేటగిరీలోని విద్యార్థులు కూడా ఫీజు చెల్లించి ఈ పరీక్షలకు హాజరుకావాలి.
- విద్యార్థులంతా ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షల్లో క్వాలిఫై అవ్వాలి. అలా కాని వారు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి తమ సుముఖతను తెలపాలి.
- ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, గైర్హాజరు అయినవారు పరీక్ష ఫీజు చెల్లించి ప్రాక్టికల్స్కు హాజరుకావాల్సి ఉంటుంది.
రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులకు..
- 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్లో చేరి ఐపీఈ-మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ మినిమం పాస్ మార్కులతో సెకండియర్లోకి ప్రమోట్ అవుతారు.
- మినిమం పాస్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఒకటి లేదా అన్ని సబ్జెక్టుల పరీక్షలను రాయొచ్చు. ఈ పరీక్షలకు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఈ పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులకు వారికి ఇచ్చిన మినిమం పాస్ మార్కులనే కొనసాగిస్తారు.
- ఐపీఈ-2021 పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఫీజు చెల్లించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలి.
0 Response to "AP Inter Board Key Announcement."
Post a Comment