Increased attendance in government schools
ప్రభుత్వ బడుల్లో పెరిగిన హాజరు
విద్యాశాఖ మంత్రి
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో బుధవారం జరిగిన 18వ స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాఠశాలల్లో పిల్లల ఆరోగ్య భద్రతకు అవసరమైన చర్యలు పూర్తి చేశామని తెలిపారు. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని పిల్లల్ని పాఠశాలలకు పంపాలని కోరారు. ఈ నెల 16నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని.. వారం రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన చర్యలు, జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. తద్వారా హాజరుశాతం పెరిగిందని చెప్పారు. మంగళవారం కొన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 85, 70, 65శాతం విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు.
నాలుగు జిల్లాలపై దృష్టి
కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు వారం రోజులుగా నమోదవుతున్నాయని... ఇక్కడ కొవిడ్ పరీక్షలు పెంచమని ఆయా జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలును కట్టడి చేస్తూ నూతన ఫీజులను నిర్ణయిస్తూ జీవోలను జారీ చేశామని చెప్పారు. జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ కమిటీ పని చేస్తుందని, అధిక ఫీజులు వసూలు చేస్తే టోల్ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. అలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
10కంటే ఎక్కువ కేసులున్న పాఠశాలలు తెరవొద్దు
10కంటే ఎక్కువ కేసులున్న పాఠశాలలను తెరవకూడదని ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులను నియంత్రించేందుకు కొవిడ్కేర్ సెంటర్లను తిరిగి ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
0 Response to "Increased attendance in government schools"
Post a Comment