Wrong expectation for retirement benefits
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తప్పని నిరీక్షణ
- 6 నెలలుగా వేలాదిమందికి అందని పీఎఫ్
- వందలాది మందికి ఆగిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్
- ఒక్కో రిటైర్డ్ టీచర్కు రూ.25 లక్షల వరకు బకాయి
- ప్రయోజనాలు అందకపోవడంతో ఆర్థిక కష్టాలు
ఉద్యోగంలో ఉన్నప్పుడు పీఆర్సీసీ, డీఏ బకాయిల కోసం ఎదురు చూపులు.. పదవీ విరమణ తర్వాత ఆర్థిక సమస్యలు. గతంలో రిటైర్మెంట్ తర్వాత 15 రోజుల్లోపు అన్ని ప్రయోజనాలూ అందేవి. ఇప్పుడు ఆర్నెల్లు దాకా ఎదురు చూడాల్సిన దుస్థితి. ఆర్థిక శాఖలో కొన్ని నెలలుగా చెల్లింపులకు నోచుకోకుండా బిల్లులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. ఇదీ.. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, విరమణ పొందిన వారి పరిస్థితి.
పాత విధానాలకు పాతర
గత ప్రభుత్వాల హయాంలో ఏ ఉద్యోగి అయినా రిటైర్ అయితే అదే నెలలో పదవీ విరమణ ప్రయోజనాలు అందేవి. ముందస్తు బిల్లులకు చెల్లింపులు జరగటంతో ఆ మొత్తాన్ని ప్రణాళికా బద్దంగా, ప్రాధాన్యాల మేరకు వినియోగించుకునేందుకు వీలు కలిగేది. ఇప్పుడు వైసీపీ పభుత్వం పాత పద్ధతులు, విధానాలకు పాతరేసింది. పదవీ విరమణ చేసే ఉద్యోగుల విషయంలో, రిటైర్మెంట్ టీచర్ల అవసరాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఉపాధ్యాయుడికి రిటైర్మెంట్ తీసుకున్న వెంటనే కనీసం రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ప్రావిడెంట్ ఫండ్ అందజేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్నెల్లదాకా అందడం లేదు.
దాదాపు 30, 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి.. పదవీ విరమణ చేశాక వచ్చే ప్రయోజనాలపై ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. ఇల్లు, పిల్లల వివాహం తదితర అవసరాలకు చేతికి వస్తుందని ఆశిస్తారు. రిటైర్మెంట్ ప్రయోజనాలపై ఎన్నో లెక్కలు ఉంటాయి. కానీ.. రిటైరయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ‘ఆ డబ్బు’ కోసం నిరీక్షించక తప్పడం లేదు. పదవీ విరమణ చేశాక 15 రోజుల్లోపు వారికి అందాల్సిన అన్ని ప్రయోజనాల కోసం.. ఇప్పుడు ఆర్నెల్లు దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వీసులో ఉన్నప్పుడే బిల్లులు పెట్టి.. విరమణ పొంది ఆర్నెల్లు అవుతున్నా.. జీపీఎఫ్, పెన్షన్, జీఐఎస్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ సర్కారు వచ్చాక జీతాలు, పెన్షన్లు నెలా నెలా ఠంచనుగా తీసుకునే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు పీఆర్సీసీ, డీఏ బకాయిల కోసం ఎదురు చూసిన వేలాదిమంది ఉద్యోగులకు.. పదవీ విరమణ తర్వాతా ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పీఎఫ్ రుణం, ఏపీజీఎల్ఐ కోసం దరఖాస్తు పెట్టుకున్న సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధితో సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాల పేరిట విచ్చల విడిగా ఖర్చు చేయడం.. జవాబుదారీతనం లేకపోవడం.. పరిమితికి మించి అప్పులు చేస్తుండటం వంటి కారణాలతోనే రాష్ట్రంలో ఇలాంటి అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పిల్లల పెళ్లిళ్లకూ అందని డబ్బు
రిటైర్మెంట్ తర్వాత డబ్బు చేతికి వస్తుందని, పిల్లల పెళ్లిళ్లు చేయవచ్చని ప్రణాళికలు వేసుకున్న రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అత్యవసరాలకు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కరోనా కారణంగా ఆస్పత్రి పాలైన కొంత మంది ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయం. కొవిడ్ చికిత్సకు హెల్త్కార్డులు ఉపయోగపడక పోవడంతో భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జమకాని కాంట్రిబ్యూషన్..
రాష్ట్రంలో 1.90 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులు చెల్లించే 10 శాతం కాంట్రిబ్యూషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మరో 10 శాతం చెల్లించాల్సి ఉంది. ప్రతి నెలా ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు సుమారు రూ.100 కోట్ల మేర కాంట్రిబ్యూషన్ చెల్లించాలి. అయితే ఫిబ్రవరి నుంచి ఖాతాల్లో ఈ నిధులు జమకాలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఏడాది కిందట రిటైర్ అయిన కొందరు ఉపాధ్యాయులకు ఇప్పటికీ ఈఐఎస్ మొత్తం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల విడుదల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం మంచిది కాదని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఇతర బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఒక్కొక్కరికీ 25 లక్షలు.
గత ఆరు నెలల్లో సుమారు 4 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. అందులో సగం మంది టీచర్లు ఉన్నారు. వారందరికీ పీఎఫ్ ఇప్పటికీ అందలేదు. వందలాది మంది టీచర్లకు ఈ ఏడాది జనవరి నుంచి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ కింది డబ్బు రావాల్సి ఉంది. సగటున ఒక్కో రిటైర్డ్ టీచర్కు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమ్యుటేషన్ కింద మరో రూ.13 లక్షల వరకు అంటే మొత్తం రూ.25 లక్షల వరకు చెల్లించాలి. కానీ ఈ బిల్లులన్నింటినీ నిలిపివేశారు. వాస్తవానికి రిటైర్మెంట్కు మూడు నెలల ముందుగా టీచర్లు తమకు రావాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులన్నీ క్లెయిమ్ చేసుకుంటారు. రిటైర్మెంట్ కాగానే ఆయా ప్రయోజనాలను వారి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక శాఖలోని సీఎ్ఫఎంఎస్ విభాగంలో కొన్ని నెలలుగా బిల్లులు చెల్లింపులకు నోచుకోకుండా కుప్పలు తెప్పలుగా ఉన్నట్లు సమాచారం. ఏపీజీఎల్ఐ బిల్లులు కూడా గతేడాది ఆగస్టు నుంచి కొన్ని నిలిచిపోయాయి. ఒక్కో టీచర్కు ఈ బిల్లు కింద దాదాపు రూ.10 లక్షల వరకు రావాల్సి ఉంది.
0 Response to "Wrong expectation for retirement benefits"
Post a Comment