ఏపీ ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఎంత : ఏప్రిల్ నుంచి అమలు - 13 న ప్రకటన .. !!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పైన ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఎంత మేర ఫిట్ మెంట్ ఇస్తారనే అంశం పైన ఇంకా స్పష్టత రావటం లేదు. ముఖ్యమంత్రి జగన్ గురువారం నిర్వహించిన ఆర్దిక శాఖ అధికారుల సమీక్షలో ఈ అంశం పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అధికారికంగా ఈ అంశం పైన ప్రకటన చేయలేదు. అయితే, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ఈ నెల 13న ప్రభుత్వం నుంచి ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.
తన ఆలోచన బయట పెట్టని సీఎం జగన్
ఈ సమీక్షలో ఆర్దికంగా ఉద్యోగులకు ఇప్పుడు చెల్లిస్తున్న వేతనాలు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపుగా రూ 18 వేల కోట్ల మేర పెంచినట్లుగా అధికారులు చెబుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా పలు కేటగిరీల్లో పని చేస్తున్న వారికి ఐఆర్.. వేతనాల పెంపుతో ఈ భారం పెరిగినట్లుగా వివరిస్తన్నారు. ఇక, ఇప్పుడు పీఆర్సీ నివేదిక మేరకు ఉద్యోగుల వేతనాల పెంచాలంటే ఎంత మేర భారం పడుతుందనే అంశం పైన లెక్కలు వేస్తున్నారు. ఒక్కో శాతానికి రూ 400 కోట్ల మేర పెరుగుతుందనే అంచనాకు వచ్చారు.
ఒక్క శాతం పెంచితే రూ 400 కోట్ల భారం
ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్న పరిస్థితుల్లో ఎంత మేర పెంచాలనే దాని పైన శాతాల వారీగా 30 నుంచి 36 శాతం వరకు అంచనాలు సిద్దం చేసారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన మనసులో మాట బయట పెట్టలేదని తెలుస్తోంది. మూడు డీఏలు పెండింగ్ లో ఉండటంతో 30 శాతం పైనే పీఆర్సీ ఖరారు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 30 శాతం పీఆర్సీ అమలు చేస్తోంది. అయితే, డీఏల పైనే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.
సోమవారం ప్రకటన ఉంటుందా?
దీంతో..దీని పైన సోమవారం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పీఆర్సీ పైన వారి అభిప్రాయాలు తీసుకోవటానికి ఆహ్వానించే ఛాన్స్ ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఎంత మేర తాము ఫిట్ మెంట్ ఆశిస్తుందీ చెప్పిన తరువాత..ప్రభుత్వం నుంచి ఆలోచన బయట పెట్టే అవకాశం ఉంది. చివరగా ముఖ్యమంత్రి వద్ద జరిగే చర్చల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వచ్చే వారంలో పూర్తి చేసే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారని చెబుతున్నారు.
వచ్చే ఏప్రిల్ నుంచి అమలు
అయితే, పీఆర్సీ అమల్లోకి వచ్చినా.. ప్రస్తుతానికి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసే విధంగా నిర్ణయించి..వచ్చే ఆర్దిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి పెరిగిన వేతనాలు చెల్లించేలా ఉద్యోగ సంఘాల ముందు ప్రతిపాదన చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే, పీఆర్సీతో పాటుగా సీపీసీ ... మరో 70కు పైగా ఉద్యోగ సంఘాల డిమాండ్ల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. వీటిలో ఎంత వరకు తక్షణం పరిష్కరించే అంశాలున్నాయనే దాని పైన కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు చెబుతున్నట్లుగా ముఖ్యమంత్రి నేరుగా పీఆర్సీ అంశం పైన ప్రకటన చేస్తారా... లేక, గతంలో మాదిరిగానే ముందుగా ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
0 Response to "How much is the fitment for AP employees: Implemented from April - Announcement on 13th ..!"
Post a Comment