CPS News
CPS పై ఫీట్లు
వారంలో రద్దుచేస్తానని చెప్పికూడా మూడేళ్లు
నాటి హామీపై ఇంకా పిల్లిమొగ్గలే
2004కి ముందుచేరిన వారికి పాత పెన్షన్ కానీ, 2003 డీఎస్సీ టీచర్లకు వర్తించదన్న సురేశ్
రద్దు అంత ఈజీ కాదన్న బుగ్గన
కమిటీలు వేసి చర్చిస్తానన్న సీఎం జగన్
రద్దు తప్ప మరేదీ వద్దంటున్న ఉద్యోగులు
హామీపై ఇంకా చర్చలు ఏమిటని నిలదీత
తాడోపేడో తేల్చుకునేందుకు మళ్లీ రోడ్డుపైకి 3న ఏలూరులో ఆత్మగౌరవ సభ
సీపీఎస్ వారంలో రద్దుచేస్తానని చెప్పారు. అలా చెప్పి అధికారంలోకి వచ్చారు. హామీ ఇచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్న ఈ దశలో ‘అదంత ఈజీ కాదు’ అంటూ ప్రభుత్వం ప్రకటించడం సీపీఎస్ ఉద్యోగులను విస్మయపరుస్తోంది. కమిటీ వేసి చర్చిస్తాం అన్న సీఎం జగన్ మాటలపై రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు. సీపీఎ్సను రద్దు చేయడం తప్ప ఈ అంశంలో చర్చించడానికి ఏముందని నిలదీస్తున్నారు. వారం అంటే అందరికీ ఏడు రోజులేనని.. కానీ ప్రభుత్వానికి మాత్రం వారం అంటే ఎన్ని రోజులు.. ఎన్ని నెలలు.. ఎన్ని సంవత్సరాలో తెలియడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఏలూరులో వచ్చేనెల మూడో తేదీన ఆత్మగౌరవ సభ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగులు రెండు లక్షలమంది ఉన్నారు. వీరికి జగన్ ప్రభుత్వం రోజుకో సినిమా చూపిస్తూ సీపీఎస్ రద్దుపై పిల్లి మొగ్గలు వేస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం 2004కి ముందు ఎంపికై సాంకేతిక కారణాలతో ఉద్యోగంలో జాయిన్ అవ్వని వారికి పాతపెన్షన్ విధానం అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలనూ ఈమేరకు ఆదేశించింది. మన రాష్ట్రంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు సాంకేతిక కారణాల వల్ల 2005లో ఎంపికై ఉద్యోగాల్లో చేరారు. కేంద్ర నిబంధనల ప్రకారం వీరందరికీ పాతపెన్షన్ విధానం అమలు చేయాలి. అది ఇప్పటికీ అమలు చేయలేదు. ఇటీవల శాసనమండలిలో దీనిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమాధానమిస్తూ ..2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తించదని, 2004 సెప్టెంబరుకి ముందు నియామకం అయిన వారికే వర్తిస్తుందని వివరించారు. అలాగే.. ఈ నెల 22వ తేదీన సీఎం అమరావతి సచివాలయంలో సీపీఎస్ పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆర్థికశాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. సీపీఎ్సపై మంత్రుల బృందం, అధికారులు... సంబంధిత ఉద్యోగుల సంఘాలకు ప్రజెంటేషన్ ఇవ్వాలని, ఆ తర్వాత చర్చలు జరపాలని, ఈ ప్రక్రియ ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కావాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ అంశంపై మండలి సభ్యులు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిని ప్రశ్నించారు. అయితే..సీపీఎస్ రద్దు అంశం అంత సులభతరమైన అంశం కాదంటూ బుగ్గన... దాని చుట్టూ అందమైన డ్రామా అల్లారు. మంత్రులు, సీఎం చేసిన ప్రకటనలను దాటవేతగానే సీపీఎస్ ఉద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. ‘‘సీపీఎ్సపై ఇవేవీ తెలియకుండానే ఆనాడు జగన్ మాట ఇచ్చారా? ఎన్నికల ముందు ఓట్ల కోసమే ఇలా చెప్పారా? సీపీఎస్ రద్దు చేయాల్సిందే. మాకు కూడా ఓల్డ్పెన్షన్ స్కీం(ఓపీఎస్) అమలు చేయాల్సిందే’’నని ఢంకా బజాయించి డిమాండ్ చేస్తున్నారు.
అమ్మో చర్చలా?
చర్చలు అనే మాట ప్రభుత్వం ఎత్తితేనే ఉద్యోగులు భయపడుతున్నారు. ఈ మాట వింటే ప్రభుత్వం పండించిన పీఆర్సీ డ్రామా గుర్తుకు వస్తోందని వాపోతున్నారు. పీఆర్సీపై ఇలాగే చర్చలు.. కమిటీలు సమావేశాలు అంటూ సాగదీసి చివరికి ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన విషయాన్ని సీపీఎస్ ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా చర్చల పేరుతో అర్ధరాత్రులు దాకా కాలక్షేపంచేసి... ఏదో ఒక రోజు సీపీఎస్ రద్దు చేయడం కుదరదు అని తేల్చేస్తారేమోనని అనుమానిస్తున్నారు. పీఆర్సీలో స్లైడ్ షోలు వేసి చూపించి ప్రభుత్వం చెప్పిందే చేసిందని.. ఉద్యోగ సంఘాల మాటలేమీ పట్టించుకోలేదని, ఇప్పుడూ అలాగే చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఏలూరులో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం(ఏపీసీపీఎ్సయూఎస్) ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ, ర్యాలీ నిర్వహించనున్నారు. రాజస్థాన్ చెబుతున్న పాఠం‘‘తమ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీని అమలు చేయడానికి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించాల్సిన పని ఏముంది? సీపీఎస్ రద్దు మినహా మేం ఏ ప్రత్యామ్నాయానికీ అంగీకరించేదిలేదు. రాజస్థాన్లో హామీ ఇవ్వకుండానే అక్కడి ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి కాంట్రిబ్యూషన్ తీసేసి పీఎఫ్ ఖాతాలను ఆ రాష్ట్రంలో తీయనున్నారు. హామీ ఇవ్వని చోటే ప్రభుత్వాలు అమలు చేస్తుంటే హామీ ఇచ్చి అమలు ఎందుకు అమలు చేయరు?’’
సీఎం దాస్, ఏపీసీపీఎ్సయూఎస్ అధ్యక్షుడు
0 Response to "CPS News"
Post a Comment