Ammavadi
అమ్మ ఒడి చేరేనా?
అమ్మఒడి కొత్త నిబంధనలతో తల్లిదండ్రుల్లో గుబులు
అమ్మఒడికి అర్థంలేని నిబంధనల కారణంగా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండు జిల్లాల్లో 7,27,219 మంది విద్యార్థులున్నారు. వారిలో అమ్మఒడికి అర్హులుగా 5,58,731 మందిని గుర్తించారు. అనర్హులు 1,31,292 మంది. 36,917 మందికి సంబంధించిన వివరాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపారు. అనాథ పిల్లలు 279 మంది ఉన్నట్టు లెక్కతేల్చారు. మొదటి సంవత్సరంలో ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున జమ చేశారు. రెండో సంవత్సరం నుంచి రూ.14 వేలకు తగ్గించారు. ఏటా జనవరి 26న నగదు జమ చేయాల్సి ఉన్నా ఈ ఏడాది అలా చేయలేదు. ఈ విద్యా సంవత్సర నగదును జూన్లో జమ చేస్తామని చెబుతున్నా అనేక ఆంక్షలు పెట్టారు.
300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగమైతేనే
విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు దాటితే అమ్మఒడి ద్వారా నగదు ఇచ్చేది లేదన్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వేసవిలో ఉష్ణ్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఇళ్లలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటోంది. ఏదో ఒకలా అమ్మఒడి నుంచి అనర్హులుగా చేసేందుకు ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. గతంలోనే విద్యుత్ మీటర్ల నెంబర్లకు ఆధార్కు అనుసంధానం చేశారు. దీంతో ఎంతమేర నెలకు విద్యుత్ వినియోగిస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.
75 శాతం హాజరు ఉంటేనే.
అమ్మఒడి లబ్ధి పొందాలంటే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి అంటూ ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ విద్యా సంవత్సరంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించారు. అనంతరం ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఇది అంత ప్రమాదకరం కాకున్నా విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండిపోయారు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా ఒమైక్రాన్ బారినపడినా ముందు జాగ్రత్త కోసం కొంతమంది పిల్లలు బడికి హాజరుకాలేదు. దీంతో హాజరు శాతం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నిబంధన సరైనది కాదన్న వాదన వినిపిస్తోంది.
జిల్లా పేరు మారాలట.
ఈనెల 4వ తేదీన జిల్లాల విభజన జరిగింది. ఆధార్ కార్డులో ఉన్న పేరు ప్రకారం వారు ఏ జిల్లాకు చెందినవారో తెలుస్తుంది. అయితే, జిల్లాల పేర్లు మారకపోతే ఈ పథకం వర్తించదనే ప్రచారమూ జరుగుతోంది. కానీ, ఇప్పటికప్పుడు ఆధార్కార్డుల్లో జిల్లాల పేర్లు మార్చడం కుదరదని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, గతంలో అన్ని అర్హతలు ఉన్నా అమ్మఒడి రాని వారున్నారు. పాఠశాలలు, సచివాలయాల చుట్టూ తిరిగినా సర్వర్ పనిచేయడం లేదనే సాకు చూపి తప్పించుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటో తెలియకుండా ఉంది.
ఇంకా ఆదేశాలు రాలేదు
అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబరును అనుసంధానం చేయాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదు. ఆధార్ కార్డులో జిల్లాల పేర్లు విషయంలోనూ ఎలాంటి ఉత్తర్వులు మాకందలేదు. గత ఏడాది లబ్ధి పొంది ఈ ఏడాది అనర్హుల జాబితాలో పేర్లున్న వాటిని పరిశీలిస్తాం.
0 Response to "Ammavadi"
Post a Comment