PRC
విధి లేని పరిస్థితుల్లోనే పీఆర్సీని అంగీకరించాం
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వంలో చిత్తశుద్ధి కరవైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో బుధవారం నాయకులు సింహాచలం, కరణం హరికృష్ణ ఆధ్వర్యంలో 12 ఉపాధ్యాయ సంఘాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ఐక్య వేదికలో చేరాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలపై వారు సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ 11వ వేతన సవరణ పట్ల ఉద్యోగులు సంతృప్తిగా లేరన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే పీఆర్సీని అంగీకరించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏకతాటిపైకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విజయవంతం అవుతామన్నారు. పీఆర్సీపై ఒప్పందం మేరకు అంగీకరించిన 22 డిమాండ్లపై ఇంతవరకు ఉత్తర్వులు వెలువడలేదన్నారు. అందుకు ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమా...అధికారుల అలసత్వమా...ఏది కారణమో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. సీపీఎస్ రద్దుపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. మే 5న సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు తదితరులున్నారు.
0 Response to "PRC"
Post a Comment