The financial condition of the state is not good
గత్యంతరం లేకనే పీఆర్సీపై బేరాలాడాం
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు
- సీఎంకు ఎంత ప్రేమ లేకపోతే 27 శాతం ఐఆర్ ఇస్తారు?
- ఉద్యోగులంతా ఆయనపై ప్రేమాభిమానాలు చూపాలి: మంత్రి పేర్ని నాని
- కొందరు ధర్నాలు, ప్రదర్శనలంటూ రెచ్చగొడుతున్నారు: సజ్జల
- పన్నుల వసూళ్లలో నిర్మాణాత్మక మార్పులు అవసరం: బుగ్గన
‘ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ బాగాలేదని కొందరు విమర్శిస్తున్నారు.. ఆ మాటకొస్తే అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితే బాగోలేదు.. గత్యంతరం లేకే పీఆర్సీపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బేరాలు ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది’ అని రాష్ట్ర రవాణా, సమాచార, ప్రసార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభ, స్వర్ణోత్సవ వేడుకలను బుధవారమిక్కడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. పేర్ని నానితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి జగన్కు ఉద్యోగుల పట్ల ఎంత ప్రేమ లేకపోతే అడక్కుండానే 27 శాతం ఐఆర్ ఇస్తారు? వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగులందరూ ఆయన పట్ల ప్రేమానురాగాలు చూపించాలి’ అని కోరారు. 50 ఏళ్లుగా ఒకే కుటుంబంగా ఐక్యంగా కొనసాగుతున్న కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ నుంచి మిగిలిన ఉద్యోగ సంఘాలు స్ఫూర్తి పొందాలన్నారు. జగన్ మంచి ప్రభుత్వాన్ని స్థాపించడానికి చేసిన యుద్ధంలో ఈ శాఖ ఉద్యోగులు చేసిన సహాయానికి వైసీపీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లయిన పీఆర్సీ, సీపీఎస్ సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధితోనే జగన్ హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి అతలాకుతం చేయడంతో మరింత దిగజారిందని చెప్పారు. అలాగని ఎన్నికల్లో హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక మరచిపోయే ప్రభుత్వం కాదని.. ప్రజలపై ఎంత మమకారం ఉందో ప్రభుత్వ ఉద్యోగులపైనా అంతే మమకారం ఉందని తెలిపారు.
ఉద్యోగుల సమస్యలను రాజకీయ ఎజెండాగా తీసుకుని ఇప్పటికీ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేసేలా కొందరు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బుగ్గన మాట్లాడుతూ.. జీఎ్సటీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పన్నుల వసూళ్లలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని.. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు నిర్మాణాత్మక మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని చెప్పారు. ఇటీవలే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, యూపీలకు ప్రత్యేక బృందాలను పంపించి పన్నుల వసూళ్లకు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులపై అధ్యయనం చేయించామని.. ఆ అధ్యయన నివేదికల ఆధారంగా రాష్ట్రంలో వాణిజ్య పన్నుల వసూళ్ల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు కొనసాగుతోందని వివరించారు. రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రతిని ఈ సభలో మంత్రుల సమక్షంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు అందజేశారు.
0 Response to "The financial condition of the state is not good"
Post a Comment