ISB medal for lorry driver's son
లారీ డ్రైవర్ కుమారుడికి ఐఎస్బీ మెడల్
నాన్న లారీడ్రైవర్.. తల్లి గృహిణి. అయితేనేం అద్భుతమైన ప్రతిభ అతడి సొంతం. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే ఆ విద్యార్థి కష్టపడి..
ఆయనే రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్ మండలం, మునగనూరుకు చెందిన బొడిగె ప్రదీప్కుమార్. ప్రదీప్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లి కాగా, వారి కుటుంబం ప్రస్తుతానికి హయత్నగర్ మండలంలోని మునగనూరులో స్థిరపడింది. తండ్రి మల్లేశం లారీడ్రైవర్గా పనిచేస్తుండగా, తల్లి మంజుల గృహిణి. ఎన్ఐటీ నాగపూర్లో బీటెక్ మెకానికల్ చదివి ఎల్అండ్టీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఏడేండ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశాడు. ఇంకా చదవాలన్న కసితో గతేడాది మొహాలీ ఐఎస్బీ క్యాంపస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ) కోర్సులో చేరి టాప్ త్రీలో నిలిచాడు. ఇందుకు గాను ఆయనకు స్కాలర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మెడల్ దక్కింది. తాను ప్రధాని చేతులమీదుగా మెడల్ అందుకుంటానని ఊహించలేదని, తన జీవితంలో ఇదో మరపురాని రోజని ప్రదీప్ అంటున్నాడు.
వరంగల్ వాసి వైదేహికి మెడల్
ఐఎస్బీ గ్రాడ్యుయేషన్డేలో భాగంగా వరంగల్కు చెందిన వైదేహి మడూరి సైతం స్కాలర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మెడల్ను ప్రధాని చేతుల మీదుగా అందుకున్నది. హైదరాబాద్ ఐఎస్బీ క్యాంపస్లో 600 మంది పీజీపీ పూర్తిచేయగా, వారిలో ముగ్గురికి 'స్కాలర్ ఆఫ్ ఎక్స్లెన్స్' మెడల్ దక్కింది. ఈ మెడల్ను తెలంగాణకు చెందిన వైదేహి దక్కించుకోవడం విశేషం. ఐఐటీ మద్రాసులో మెకానికల్ బ్రాంచ్లో బీటెక్ పూర్తి చేసి మెకెన్సీ సంస్థలో బిజినెస్ అనలిస్టుగా ఉద్యోగంలో చేరింది. గత ఏడాది ఐఎస్బీ హైదరాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ) కోర్సులో చేరింది. మంచి ప్రతిభను సాధించి, మెడల్కు ఎంపికయ్యింది. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా మెడల్ అందుకోవడం తన జీవితంలో మరిచిపోలేనని వైదేహి సంతోషాన్ని వెలిబుచ్చింది. కోర్సు పూర్తికావడంతో తాను తిరిగి మెకన్సీ కంపెనీలోనే చేరతానని వైదేహి అంటున్నది. తనకు కంపెనీలో అసోసియేట్గా పదోన్నతి లభించిందని, పీజీపీ కోర్సుపూర్తిచేయడం, మెడల్ రాకతో తన వేతనం మూడు రెట్లు పెరుగుతుందని ఆమె తెలిపింది.
ఆసియాలోనే ఐఎస్బీ టాప్
ఆసియాలోనే టాప్ బిజినెస్ స్కూల్గా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. దేశానికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన హైదరాబాద్ ఐఎస్బీ 20వ వార్షికోత్సవానికి మోదీ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఎస్బీలో చదువుకున్న దాదాపు 50 వేల మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రారంభించిన ఐఎస్బీ ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగడం సంతోషకరమని పేర్కొన్నారు.
మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు వచ్చే 25 ఏండ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని ఐఎస్బీకి సూచించారు. ప్రపంచంలో 3వ అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా నేడు భారత్ అవతరించిందని, కరోనా సమయంలో భారత్ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయని చెప్పారు. దేనికైనా రిఫామ్స్ (సంస్కరణలు), పెర్ఫార్మ్ (ఆచరణ), ట్రాన్స్ఫామ్ (బదలాయింపు) అనే మూడు ముఖ్యమని పేర్కొన్నారు. అంతకుముందు ఐఎస్బీ క్యాంపస్లో ఆయన పారిజాత మొక్కను నాటారు. ఐఎస్బీ 20 ఏండ్ల ప్రస్థానంతో కూడిన హిస్టరీ వాల్ను సందర్శించారు. ఐఎస్బీ 20 ఏండ్ల పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 Response to "ISB medal for lorry driver's son"
Post a Comment