Kedarnath Temple
Kedarnath Temple : తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు. పులకించిన భక్తజనం .కరోనా ఆంక్షల నడుమ అనుమతి.
Kedarnath Temple: ప్రముఖ శైవ క్షేత్రం కేదార్నాథ్ ఆలయ ద్వారాలు శుక్రవారం ఉదయం తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్లో (Uttarakhand) ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారీశ్వరుడి ఆలయ తలుపులు ఉదయం 6.26 గంటలకు ఆచారాలు , వేద మంత్రోచ్ఛారణల నడుమ యాత్రికుల కోసం తెరవబడ్డాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆలయానికి హాజరై పవిత్రోత్సవాన్ని తిలకించారు.
ఆరు నెలల తర్వాత తెరచుకున్న కేదారేశ్వరుని ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఏడాదిలో ఎక్కువ కాలం మంచుతో కప్పబడి ఉంటుంది. అటువంటి సమయంలో కేదార్నాథ్ క్షేత్రాన్ని ముసివేస్తారు. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ సాధారణం కావడంతో ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. కేదార్నాథ్ ఆలయం పునఃప్రారంభం సందర్భంగా యాత్రకు వచ్చే భక్తులకు సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు.
మరోవైపు అక్షయ తృతీయ సందర్భంగా మే 3 నుంచి చార్ ధామ్ యాత్ర కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కేదార్నాథ్ చేరుకోవడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం అన్ని ఆలయాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా చార్ ధామ్ యాత్ర 2022 కోసం యాత్రికుల సంఖ్యపై ప్రభుత్వం రోజువారీ పరిమితిని నిర్ణయించింన సంగతి తెలిసిందే. అధికారులు భక్తుల రద్దీ, కరోనా ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని కేదార్నాథ్ ఆలయానికి రోజుకి 12000 మందిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. ఇక బద్రీనాథ్కు 15000 మంది భక్తులను అనుమతించనున్నారు. మరోవైపు, చార్ ధామ్ యాత్రకు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదా కోవిడ్ టీకా సర్టిఫికేట్ తప్పనిసరి కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. కరోనా కారణంగా కుదేలైన పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
6 నెలల తరువాత కేధర్నాధ్ గుడి ద్వారం తెరిచే దృశ్యం
0 Response to "Kedarnath Temple"
Post a Comment