Protest boards at employee residences
CPS ను రద్దు చేయందే ‘గడప’కు వద్దు
- సీపీఎస్పై ప్రభుత్వానికి ఉక్కపోత
- ఉద్యోగుల నివాసాల వద్ద నిరసన బోర్డులు
ఉద్యమాల కోసం రోడ్డెక్కితే నిర్భందాలు, అక్రమ అరెస్టులు... కేసులు బెదిరింపులు... శాఖాపర శిక్షలు.. ఇలా...ఎన్నో ఎదుర్కోవాలి... సోషల్ మీడియాలోనూ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచలేని పరిస్థితి! సీపీఎస్ రద్దుకోసం తదుపరి అడుగులపై మథనం! ఇంతలో సీఎం జగన్ తన ప్రజాప్రతినిధులను గ్రామాలకు పంపడం సీపీఎస్ రద్దు ఉద్యమానికి కలిసివచ్చింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో పాల్గొనే మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ నిరసన సెగను ఇంటినుంచే చవిచూపిస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి...ఓపీఎస్ పునరుద్ధరించాకే తమ గడపలకు రావాలంటూ ఇళ్ల గేట్లకు బోర్డులను వేలాడదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ విధానంలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్రలో నాటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి జగన్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామంటూ ఢంకా భజాయించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రద్దు చేయకపోవడంతో సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, ర్యాలీలు, ముట్టడి కార్యక్రమాలు, సభలు సమావేశాలు నిర్వహించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరోవైపు సీపీఎస్పై జగన్ సర్కారు మంత్రుల కమిటీ వేసింది. ఆ కమిటీ తో సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేస్తామంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో ఉద్యోగులు భగ్గుమన్నారు. పలు రకాలుగా నిరసనలు తెలిపారు. అయినా ప్రభుత్వం నోరుమొదపడంలేదు. ఇలాంటి సమయంలో ‘గడప గడపకు..’ కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వ నిర్భందాలు, వేధింపులు లేకుండా నిరసన తెలిపేందుకు దీన్నొక మార్గం చేసుకున్నారు. దీంతో జగన్ సర్కారుకు ఉక్కపోత మొదలైంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ప్రభుత్వాలకు తటస్థపడలేదని అధికార వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఉద్యోగులకే ఈ నిరసనలు పరిమితం అవుతాయా? లేక వివిధ రకాల సమస్యలతో సతమతం అవుతున్న ప్రజలు కూడా ఇదేబాటపట్టి ఇంటి ముందు బోర్డులు పెడతారా.. అనే భయసందేహాలు ప్రభుత్వవర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
బాపట్లలో ఉద్యోగి నిరసన బోర్డు
సీపీఎస్ రద్దు చేసి గడప తొక్కండి అంటూ ఉద్యోగులు తమ ఇంటి వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గడప గడపకు కార్యక్రమానికి నిరసన తెలుపుతూ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారిపాలెంలోని తన నివాసం వద్ద గుర్రం మురళీమోహన్ అనే ఉద్యోగి బోర్డు పెట్టారు. ఆయన సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి. సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిన తర్వాతే మంత్రులు, శాసనసభ్యులు.. ఉద్యోగులు నివసించే ప్రాంతాలకు రావాల్సిఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీపీఎస్ ఉద్యోగులందరూ తమ నివాసాల వద్ద ఇలాగే బోర్డులు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
0 Response to "Protest boards at employee residences"
Post a Comment