వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రికార్డు స్థాయిలో పత్తి ధర .
పత్తి రైతులు మురిసేలా.. మైమరిపించేలా ధర పలుకుతోంది. పత్తి ధర దూసుకుపోతుంది. పొలాల్లో పంట భారీగా పండకున్నా..
మార్కెట్లో ధర భారీగా పలుకుతుండటంతో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. పత్తి ధర ప్రజెంట్ రికార్డు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. మద్దతు ధర కంటే అధికంగా ధర వస్తోంది. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ ఉండటంతో ఒక్కసారిగా పెరిగిన ధరను చూసి రైతులు కూడా సంతోషిస్తున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం క్వింటాల్ పత్తికి రూ.14 వేల రికార్డు ధర పలకడం గమనార్హం. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన పత్తి రైతు యాట ప్రభాకర్ మంగళవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్కు పత్తిని తీసుకురాగా విశ్వనాథ్ ట్రేడింగ్ కంపెనీ రూ.14 వేలకు క్వింటా పత్తిని కొనుగోలు చేయడం విశేషం. ఈ ధర పత్తి కొనుగోళ్లలో ఆల్ టైం రికార్డును నమోదు చేసిందని వరంగల్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సీజన్లో పత్తి దిగుబడి తగ్గడంతోపాటు అంతర్జాతీయంగా ఏర్పడిన డిమాండ్ కారణంగానే క్రమంగా పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది జనవరి మొదట్లో క్వింటాల్ పత్తి ధర రూ. 8000 పలకగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత నెల మొదటి వారంలో రూ. 10 వేల మార్కును దాటిన క్వింటాల్ పత్తి ధర కేవలం నెల రోజుల వ్యవధిలోనే అనుహ్యంగా నాలుగు వేలు ఎగబాకి ఏకంగా రూ.14000లకు చేరుకోవడంతో పత్తి రైతులు సంబుర పడుతున్నారు.
రైతుల్లో ఆశలు..
వాస్తవానికి ఈ ఏడాది ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు కాయ తొలుచు పురుగు వల్ల పత్తి పంట నాశనమైందనే చెప్పాలి. చాలా మంది రైతులకు ఎకరానికి మూడు నాలుగు క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. ఇంకొంతమంది రైతులు ఏమాత్రం దిగుబడి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయారు. గత అక్టోబర్ మాసంలో రూ. 4 వేలు నుంచి రూ. 5 వేల వరకు ధర ఉంది. ప్రస్తుతం రూ.14 వేలకు చేరుకోవడం గుడ్డిలో మెల్ల అన్న చందంగా దిగుబడి వచ్చిన కాసింత పత్తితోనైనా నష్టాల నుంచి బయట పడవచ్చనే ఆశలు కల్పిస్తోంది.
0 Response to "RAITE-RAJU"
Post a Comment