Mahaa Bhaaratham
మహాభారత యుద్ధంలో కౌరవులు ( 100 మంది ) చనిపోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలామంది, పూజలు చేసాము, వ్రతాలు చేసాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని అని అనుకుంటారు, కానీ అవి ఎంతవరకు మనల్ని భగవత్ సన్నిధికి చేర్చుతాయని మనలో ఎవరికీ తెలియదు. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా?
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. శ్రీ కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉన్నాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.
అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు నాకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?” అని నిలదీస్తాడు.
అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు…ఓ రాజా... ఇదంతా నేను చేసిందీ కాదు, నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్ర శోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ... అంటూ గత జన్మని గుర్తు చేస్తాడు... యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతకుడివి (వేటగాడివి)... ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంల, ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి, వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా, అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు.
తమ కంటి ముందే తమకు కాబోయే నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది.
నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింప జేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు రాజా అని అంటాడు.
ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు...
కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.? అని ప్రశ్నిస్తాడు.
అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి. ఓ రాజా వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.ఎన్నో సత్కర్మలు ఆచరించాలి, ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించు కున్నావు, వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు.
అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలి పోతాడు. మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకు పోతాయో ఎవరికీ తెలియదు, అందు కోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసి పోవడం వద్దు అహంకార మమ కారాలకు దూరంగా ఉండి, అంతా భగవాబుతుంది లీల అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి.
భూమి మీదపడినప్పటినుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆధ్యాత్మిక కధ విన్నా, ఏ కధైనా మనకర్మ ఫలమే. నవ్వులో గానీ, మాట్లాడడంలో గానీ, అతి జాగ్రత్తవహించాలి. గతాన్ని ఏమీ చేయలేకపోయినా ఇప్పటినుండి జాగ్రత్తగా వ్యవహరించాలి. పూర్వ జన్మలలో మనం చేసిన పాపాలకు ఖచ్చితంగా ఖర్మ ఫలితాలు అనుభవించక తప్పదు అనేది శ్రీ కృష్ణ భగవానుడి నీతి వాక్యం.
0 Response to "Mahaa Bhaaratham"
Post a Comment