Books appeared as if they were in town! how is that What actually happened?
ఊర్లో ఉన్నట్లుండి పుస్తకాలు ప్రత్యక్షమయ్యాయి ! అదెలా ? అసలు ఏం జరిగింది.
పిక్లా తాండా అనే పేరు ఎపుడైనా ఎవరైనా విన్నారా? కష్టమే. నలుగురి నోట పడి నానేంత విశేషమున్న తాండా కాదది.
తెలంగాణ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక మారుమూల గిరిజన గ్రామ పంచాయతీ ఇది. ఊరి జనాభా 970. చిన్న ఊరికి తగట్టు ఆ ఊర్లో మూడో తరగతి దాకా మాత్రమే ఉండే బుల్లి స్కూలు. తాండాకు ఉన్న ఒకే ఒక విశేషం, సర్చంచు మహిళ కావడం. మరొక విశేషం చెబితే, పుస్తక పఠనం అంతరించిపోతున్నదని బాధపడే ఐఎఎస్ అధికారి ఒకరు ఆ ప్రాంతానికి అదనపు కలెక్టర్ గా రావడం.
పేరు చెబుతున్నట్లు అది 100 శాతం గిరిజన గ్రామం. గోండులు, లంబాడీలు తప్ప మరొక జాతి లేని గ్రామం. చెట్టూ, చేమ, గుట్టలు, అడవులే వాళ్ల ప్రపంచం.
అందువల్ల పిక్లాతాండ గురించి బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. అవసరమూ లేదు. అయితే, ఇపుడు పిక్లాతాండా ఒక విశేషమయింది. ఒక్క రోజున పొద్దునే ఉన్నట్లుండి ఆ ఊరి నడుమ పుస్తకాలు ప్రత్యక్షమయ్యాయి.
తాండాలో స్కూలుంది. అయితే, అందులో ఏముంటుంది, ఒక బ్లాక్ బోర్డు, ఒక కుర్చీ తప్ప. కాకపోతే, పిల్లల దగ్గర నాలుగు నోటు బుక్కులుంటాయి. ఇవెపుడూ ఆకర్షణీయ వస్తువులు కాదు ఆ పల్లెలో. స్కూల్ బుక్కులు తప్ప మరొక పుస్తకం ప్రపంచంలో ఉంటుందని తెలియని అమాయకపు పల్లె పిక్లా తాండా.
ఇలాంటి ఊర్లో ఉన్నట్లుండి రకరకాల పుస్తకాలు ప్రత్యక్షమయితే ఎలా ఉంటుంది?
అందరి దృష్టి ఇపుడు ఆ పుస్తకాల మీద పడింది. ప్రపంచం విశాలమని, అక్కడ ఈ నోటు పుస్తకాలు, బలపాలు, పలకలు, పాఠ్యపుస్తకాలే కాకుండా, ఇంకా పెద్ద పెద్ద పుస్తకాలుంటాయని, వాటిని తీరుబడిగా చదువుకోవచ్చని తొలిసారి పిక్లాతాండా వాసులకు, బడి పిల్లలకు తెలిసింది దీని వల్ల.
ఏమిటా పుస్తకాల వింత
ఆ ఊర్లో ఎదురయిన వింత ఏంటంటే... ఒక చిట్టి పొట్టి చిత్రమయిన మొబైల్ లైబ్రరి పుట్టింది. లైబ్రరీ అంటే పెద్దదో చిన్నదో ఒక గది, ఒకటి రెండు బీరువాలు, చాలా పుస్తకాలు కళ్ల ముందు కదలాడతాయి. కాని, పిక్లాతాండా లో వెలసిన లైబ్రరీ ఒక చిన్న చెక్క స్తంభం మీద నిలబడిన చెక్క పెట్టె. చెక్కపెట్టెకొక గాజు తలపు. లోన కొన్ని పుస్తకాలు. అంతే.
ప్రతిరోజు పొద్దునే ఈ పెట్టెని పంచాయతీ కార్యాలయం నుంచి రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చి నిలబెడతారు. పెట్టె స్తంభానికి అటూ ఇటూ బెంచీలు ఏర్పాటు చేస్తారు. అదే పిక్లాతాండా లైబ్రరీ. పిడికెడు పుస్తకాలకు ఇంత అందమయిన ఆకారం ఇచ్చింది ఎవరై ఉంటారు. ఇది ఒక అసాధారణమయిన ఆలోచన. పుస్తకాన్ని ఒక ఊరికి ఇలా కొత్త తరహాలో ప్రచారంలో చేయాలనుకోవడం ఎంత ముచ్చటయిన విషయం. దీనికి జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి. ఇంజనీరింగ్ చదివి ఐఎఎస్ కు ఎంపికయ్యారు వరుణ్.
ఎవరైనా వచ్చి అక్కడే కూర్చుని ఈ పుస్తకాలు చదువుకోవచ్చు. సాయంకాలం 6 దాక ఈ బుల్లి లైబ్రరీ తలుపులు తెరుచుకునే ఉంటాయి తర్వాత అది మళ్లీ పంచాయతీ కార్యాలయానికి తరలిపోతుంది. అందుకే దీనిని తాండా ‘సంచార గ్రంథాలయం’ని పిలుస్తున్నట్లు ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి బొర్లకుంట మనీష్ తెలిపారు.
ఒక వారం కిందట మొదలయిన ఈ లైబ్రరీ గ్రామంలో ఒక చోద్యం అయింది. ఊర్లో పుస్తకాలను ఇలా ఏర్పాటు చేసుకోవచ్చా, ఎవరైనా వచ్చి చదువుకోవచ్చా అనేది చర్చనీయాంశమయింది. చదివే వారు, చదువురాని వచ్చి పుస్తకం పట్టుకుని చూసి వెళ్తున్నారు. ఒక గ్రామస్థుడు జీవితంలో తొలిసారి సరదా కోసమయినా సరే, అబ్బురపాటుతో నైనా సరే మొదటి సారి పుస్తకం చేత పట్టుకోవడం అక్కడ కనిపించే అద్భుతమయిన దృశ్యం . ఇది టర్నింగ్ పాయింట్, చారిత్రాత్మకం అని మనీష్ చెప్పారు.
” పుస్తకం పఠనం బాగా తగ్గిపోతా ఉంది. సోషల్ మీడియా జీవితంలోకి ప్రవేశించి పుస్తకాన్ని తరిమేస్తూ ఉంది. పిక్లాతాండా లాంటి ఊర్లలో ఈ పరిస్థితి ఇంకా ముదరలేదు. కాబట్టి ఇక్కడి పిల్లల్లో పుస్తకం చేత పట్టే అలవాటు తీసుకురావచ్చని మా ఆశ. రోజుకు నలుగురైదుగురు పిల్లలు వచ్చి, ఈ పుస్తకాలను తిరగేసి వెళ్లినా మా అదనపు కలెక్టర్
ప్రయోగం విజయవంతమయినట్లే లెక్క,” అని మనీష్ చెప్పారు. ఇపుడు అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి చెబుతూ ప్రస్తుతానికి తక్కువ సంఖ్యలోనే పుస్తకాలు ఉన్నాయని, తొందరలోనే వాటి సంఖ్య పెంచడమే కాదు, వైవిధ్యం కూడ తీసుకువచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇపుడు సుమతి శతకం, భాస్కర శతకం, కాళోజీ ‘నా గోడవ’, శ్రీ శ్రీ మహాప్రస్థానం, పెద్దబాల శిక్ష, ఇంగ్లీష్ గ్రామర్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ కు సంబంధించిన మరికొన్ని పుస్తకాలు, సాహిత్యం అందుబాటులో ఉంచారు. ఇక ముందు తెలంగాణ సంస్కృతి,టూరిజం, బొమ్మల నీతి కథలు, భారత రామాయణ కథల పుస్తకాలను తెస్తున్నామని ఆయన చెప్పారు. తాము చదివిన పుస్తకాలను ఎవరైనా విరాళంగా ఇస్తే సంతొషంగా ఇక్కడి ప్రజలకు అందచేస్తామని మనీష్ చెప్పారు.
జాయింట్ కలెక్టర్ వరుణ్ రెడ్డి కి ఈ ఆలోచన ఎలా వచ్చింది. విదేశాలలోని కాలనీలలో ఇలాంటి లైబ్రరీలు ఉన్నట్లు ఆయన ఒక మిత్రుడు చెప్పారట. పావురాల గూళ్ల స్తంభాల్లాగా కాలనీలలో ఏర్పాటు చేసిన టినీ లైబ్రరీల గురించి చదివి ఆయన ముచ్చట పడ్డారు. అక్కడ అవి బాగా పాపులర్ అయ్యాయని తెలుసుకున్నారు.
ఇలాంటి ప్రయోగం తెలంగాణ మారుమూల గ్రామాల్లో ఎందుకు చేయరాదు అని వరుణ్ రెడ్డికి అనిపించింది. అంతే, పిక్లా తాండాను ఆయన ఎంచుకున్నారు. స్థానిక సర్పంచ్ బానోత్ మంగీబాయ్ కిషన్ ని భాగస్వామిని చేశారు. గ్రామ కార్యదర్శి బొర్లకుంట మనీష్ వెంటనే బాక్స్ ఏర్పాటు చేశారు. గ్రామస్థులంతా ఈ ప్రయోగానికి మద్దతు తెలిపారు. ఇంకేముంది, ఇల్లు అలికి, ముగ్గు వేసి స్వాగతం అని రాసి పుస్తకం పండగ చేసుకున్నారుమొన్న ఎప్రిల్ లో. ఎంతో గొప్ప సంబరం కదూ!
తన దగ్గర ఉన్న పుస్తకాలను ఆయన అందించారు. మరికొందరు మరిన్ని పుస్తకాలు అందించారు. చిట్టి లైబ్రరీ తయారయింది. ఇపుడాయన అక్కడి నుంచి బదిలీ అయి ఉట్నూర్ ఐటీడీఏ వెళ్లారు. అయితే తాను చేసిన ప్రయోగం కొనసాగాలని ఆయన ఒక కన్నేసి గమనిస్తూనే ఉండాలని ఆశిద్దాం.
ఈ ఊర్లో కొంతమంది ఇంటర్ డిగ్రీ దాకా చదివిన వారున్నారు. వారికి కాంపిటీటివ్ పరీక్షల పుస్తకాలు అవసరం. నిజానికి ఇక్కడున్న అర్థిక పరిస్థితులకు మంచి పుస్తకాలు కొనడం కూడా వారికి కష్టమే. ఎవయినా కొనాలన్నా పట్టణాలకు వెళ్లాలి. అది ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల ఇలాంటి విద్యార్థుల అవసరాలు తీర్చే పుస్తకాలను తొందర్లోనే ఈ లైబ్రరీలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
0 Response to "Books appeared as if they were in town! how is that What actually happened?"
Post a Comment