Do not proceed till October 20 on the two MEOs for the zone
మండలానికిద్దరు ఎంఈవోలపై అక్టోబరు 20వ తేదీ వరకు ముందుకెళ్లొద్దు
- రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- విచారణ అక్టోబరు 20కి వాయిదా
మండలానికి ఇద్దరు విద్యాధికారుల నియామకంపై అక్టోబరు 20 వరకు ముందుకెళ్లవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఆ తేదీకి వాయిదా వేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 16న జారీ చేసిన జీవో 154ని సవాల్ చేస్తూ జడ్పీ హైస్కూళ్లలో పనిచేస్తున్న పలువురు ప్రధానోపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వుకు విరుద్ధమని, అదనపు ఎంఈవో పోస్టుల సృష్టికి రాష్ట్రపతి ఉత్తర్వు తప్పనిసరని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 250 మంది హెడ్మాస్టర్లను ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలతో ఎంఈవోలుగా నియమించిందన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న హెడ్మాస్టర్లను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని.. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వారిని పూర్తిస్థాయి ఎంఈవోలుగా నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అదే జరిగితే జడ్పీ హైస్కూళ్లలో పనిచేసేవారు ఎంఈవోలుగా పదోన్నతి పొందే అవకాశం పోతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులను సమీకృత సర్వీసులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా హైకోర్టు తప్పుబట్టిందని గుర్తుచేశారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించకుండా ఉద్యోగుల సర్వీసును మార్చేందుకు గానీ, అదనపు పోస్టులు సృష్టించే అధికారం గానీ ప్రభుత్వానికి లేవన్నారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తూ.. పిటిషనర్లది ఊహాజనిత ఆందోళన మాత్రమేనని.. పాఠశాలల్లో మెరుగైన సేవలు అందించేందుకే అదనపు పోస్టులు సృష్టించామని తెలిపింది. అదనపు పోస్టులు సృష్టించేందుకు రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరమా కాదా అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) కాసా జగన్మోహన్రెడ్డిని హైకోర్టు ప్రశ్నించగా.. ఆయన నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. ఈ సందర్భంగా ఎస్జీపీ కోర్టుపై అనవసరమైన వాఖ్యలు చేశారని.. అవి తీవ్ర అభ్యంతరకరమని న్యాయస్థానం తన ఉత్తర్వులో పేర్కొంది.
0 Response to "Do not proceed till October 20 on the two MEOs for the zone"
Post a Comment