Eight years of service for transfers of teachers
టీచర్ల బదిలీలకు ఎనిమిదేళ్ల సర్వీసు
- ఇటీవల ఐదేళ్లకు కుదించిన పాఠశాల విద్యా శాఖ
- పెంచాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన సీఎం!
ఉపాధ్యాయ బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. బదిలీలకు ఎనిమిదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకోనుంది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తికి సీఎం జగన్ ఈ మేరకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆయన పాఠశాల విద్యా శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. గతంలో ఉపాధ్యాయ బదిలీల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెం ట్లకు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకునేవారు. కానీ ఈసారి అందరికీ ఐదేళ్ల సర్వీసును తీసుకుంటున్నట్లు ఇటీవల పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏకంగా 80శాతం మంది టీచర్లు బదిలీ కావాల్సి వస్తుందని, గతంలో మాదిరిగా ఎనిమిదేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు పలు మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కాగా ఎక్కువ మంది ఐదేళ్లు కోరుతున్నారని కొద్దిరోజుల కిందట సంఘాలతో జరిగిన సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దీంతో ఇక దాదాపుగా అందరికీ స్థానచలనం తప్పదని టీచర్లు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం తాజా నిర్ణయం వారికి ఉపశమనం కలిగించనుంది. ఎనిమిదేళ్లను ప్రామాణి కంగా తీసుకుని బదిలీలు చేపడితే ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపాయి.
0 Response to "Eight years of service for transfers of teachers"
Post a Comment