Today, Jagan will take a key decision on the cases of employee arrangements for CPS Chalo Vijayawada.
తేలని CPS ఛలో విజయవాడకు ఉద్యోగుల ఏర్పాట్లు కేసులపై నేడు జగన్ కీలక నిర్ణయం.
ఏపీలో వైసీపీ హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు. సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 11న ఛలో విజయవాడ చేపట్టేందుకు ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఏపీలో సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు సాగిస్తున్న పోరు క్లైమాక్స్ కు చేరుకుంది. సీపీఎస్ రద్దుపై తొందరపడి హామీ ఇచ్చామన్న మంత్రుల వ్యాఖ్యలతో ఉద్యోగులు భగ్గుమంటున్నారు. నిన్న జరిపిన చర్చల్లోనూ సీపీఎస్ రద్దు చేస్తే జీపీఎస్ అమలు చేస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఉద్యోగులు అంగీకరించలేదు. దీంతో చర్చలు మరోసారి విఫలమైనట్లయింది. ప్రభుత్వం తొందరపడి ఇచ్చిన హామీ అమలుకు ఉద్యోగులు పట్టుబడుతుండటంతో ప్రభుత్వం పూర్తిగా ఇరుకునపడుతోంది. దీంతో ఇతర అంశాలపై సర్కార్ దృష్టిసారిస్తోంది.
మంత్రుల ప్రకటనపై ఉద్యోగుల ఫైర్
సీపీఎస్ రద్దు చేస్తే దాని స్ధానంలో జీపీఎస్ 2.0 తీసుకొస్తామంటూ ఐదు సవరణల్ని మంత్రులు ప్రతిపాదించారు. అవి కూడా ఉద్యోగులకు ఆమోదయోగ్యం కాకపోవడంతో మంత్రులు చేసేది లేక చర్చలు ముగించారు. అనంతరం సీపీఎస్ పై తొందరపడి హామీ ఇచ్చామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దీంతో మంత్రి ప్రకటనపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. కేంద్రంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో సీపీఎస్ రద్దు కుదరదని మంత్రులు తేల్చిచెప్పడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఛలో విజయవాడకు ఏర్పాట్లు
సీపీఎస్ రద్దుపై ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో గతంలో ప్రకటించిన విధంగానే ఈ నెల 11న ఛలో విజయవాడ నిర్వహించేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. నిన్న చర్చలు విఫలం కావడంతో జిల్లాల్లో ఉన్న ఉద్యోగసంఘాలకు ఈ మేరకు నేతలు సమాచారం పంపారు. ఈ నెల 11న విజయవాడకు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అయితే సీపీఎస్ ఉద్యోగులపై రాష్ట్రంలో పలు చోట్ల ప్రభుత్వం నమోదు చేసిన కేసులు ఇక్కడ కీలకంగా మారిపోయాయి. ఉద్యోగులు ముందుకెళితే ప్రభుత్వం కేసుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తుందన్న అంచనాలతో ఉత్కంఠ పెరుగుతోంది.
కేసులపై నేడు తేల్చబోతున్న జగన్
సీపీఎస్ ఉద్యమం, ఛలో విజయవాడ పిలుపు నేపథ్యంలో గత నెల చివర్లో రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉద్యోగులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇందులో పలు తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యోగుల్ని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు అప్పట్లో మంత్రి బొత్స కూడా వెల్లడించారు. అయితే నిన్న జరిగిన చర్చల్లో ఉద్యోగులపై కేసుల నమోదు వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. కేసుల్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని మంత్రుల్ని ఉద్యోగ నేతలు కోరారు.అయితే సీఎం జగన్ తో గురువారం చర్చించిన తర్వాత కేసులపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో ఇవాళ సీఎం జగన్ తాజా పరిస్ధితిని సమీక్షించి కేసులపై నిర్ణయం ప్రకటించనున్నారు. అయితే కేసులు ఎత్తేసినా ఉద్యోగులు ఛలో విజయవాడ ఉపసంహరించుకోవడం కష్టమేనని తెలుస్తోంది.
0 Response to "Today, Jagan will take a key decision on the cases of employee arrangements for CPS Chalo Vijayawada."
Post a Comment