Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today is Sri Subrahmanya Shashti

ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

Today is Sri Subrahmanya Shashti

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము !

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై ! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి , వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున ! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.

అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి , శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు ! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా ! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.

ఇలా ఉండగా ! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.

ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని , షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని , కార్తికేయుడని , అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు , సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.

కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు , దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి , వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా , ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.

అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని , సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.

ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు , పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.

ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు , చర్మవ్యాధులు తగ్గుతాయని , పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు , వెండి , పూలు పడగలు , వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.

వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి , సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి , సత్సంతానం , వంశాభివృద్ధి , జ్ఞానము , తేజస్సు, పాప కర్మల నుండీ విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము.

ఈ రోజున పెళ్లి కానివారు , సంతానం లేనివారు సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామిని పూజించండి

మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని అర్థం. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం. 

మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం , దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుధ్ధ షష్టినాడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశ్యపుని కుమారుడు ‘నీముచి’. ‘నీముచి’ కొడుకు తారకాసురుడు. 

తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సుచేసి ఆయన ఆత్మ లింగాన్ని వరంగా పొందుతాడు.

అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. వర ప్రభావంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. 

అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు. ఇక తమ వల్లకాదనుకుని తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని శివుడ్ని వేడుకున్నారట. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు. 

కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడ్ని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరుకూడా వుంది.

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి , సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. 

సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మన శరీరంలో ఉండే కుండలినీ శక్తికి సుబ్రహ్మణ్యస్వామి అధిదైవం. పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యస్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసినవారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని , ప్రకృతిని కాపాడడం కోసం ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.

కొంతమంది ఈ రోజు బ్రహ్మచారులను పూజిస్తారు. కుజుడు మనిషికి శక్తి , ధనాన్ని , ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల , సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం , సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి , రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.

పెళ్ళికాని వారు , పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. 

అంతే కాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా , కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. 

తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్టి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం.

ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ , పాలతోనూ నింపుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారు ఝూమున లేచి తలస్నానమాచరించి పాలు , పంచాదారలతో నిండిన కావడిలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార , పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి.

మంగళవారం , శుద్ధ షష్టి , మృగశిర , చిత్త , ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి , సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం , కుజ మంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర , శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ , పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. ఇందువల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.

కాలసర్పదోషం ఉన్నవారికి సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు,కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది, అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్ర్తీలు పూజలు చేయడం మనం చూస్తూ వుంటాం.

సంతానప్రాప్తిని కోరే స్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108 మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి,సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Today is Sri Subrahmanya Shashti"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0