Acceptance of online applications for transfer of teachers has started
టీచర్ల బదిలీలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- గందరగోళంగా సాప్ట్వేర్ రూపకల్పన
- ఆందోళనలో ఉపాధ్యాయవర్గాలు
- 8ఏళ్ల సర్వీసు సీలింగ్తో పలువురికి నష్టం
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు బుధవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈనెల 17వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ బదిలీల ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 1,532మంది టీచర్లు, 215 మంది గ్రేడ్-2 హెచ్ఎంలు వెరసి 1,747 మందికి స్థాన చలనం కలగనుంది. ప్రభుత్వం ముందుగానే బదిలీల షెడ్యూల్ విడుదల చేసినా సాఫ్ట్వేర్ను తప్పులతడకగా రూపొందించారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఎనిమిదేళ్ల సర్వీసును మాత్రమే సాఫ్ట్వేర్ స్వీకరిస్తోందని, అంతకుమించి ఎక్కువ ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ బదిలీల్లో కేటగిరీ-4 ప్రాంతంలో (రవాణా, రోడ్డు మార్గంలేని) పనిచేసే టీచర్లకు ఏడాదికి ఐదు పాయింట్లు, కేటగిరీ-3లో(గ్రామీణ ప్రాంతం) 3పాయింట్లు, కేటగిరీ-2(పట్టణ ప్రాంతాలు) వారికి 2పాయింట్లు, కేటగిరీ-1వారికి(నగరాలు) ఒక పాయింటు చొప్పున ఆగస్టు 31నాటికి ఉన్న సర్వీసు ఆధారంగా పాయింట్ల కేటాయింపు ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. కానీ, బదిలీల ఉత్తర్వుల్లో సీలింగ్ అనేపదం లేకపోయినా.. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్న వారికి ఎనిమిదేళ్ల సర్వీసు సీలింగ్ ఉంది. అంతకుమించి ఎక్కువ సర్వీసు కలిగి ఉన్నా వెబ్సైట్ తీసుకోవడం లేదు. దీనివల్ల కేటగిరీ-3, 4 ప్రాంతాల్లో పనిచేసిన టీచర్లకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. మూడో కేటగిరీలో కొందరు టీచర్లకు 9, 10 ఏళ్ల సర్వీసు ఉండడంతో వారికి మొత్తంగా దాదాపు 30 పాయింట్లు, నాలుగో కేటగిరీలోనూ ఐదుపాయింట్ల చొప్పున ఎక్కువ సర్వీసు ఉన్నవారికి ఎక్కువ పాయింట్లు రావాల్సి ఉంది. కానీ, గరిష్ఠంగా ఎనిమిదేళ్లకు 24పాయింట్లు మాత్రమే తీసుకునేలా సాఫ్ట్వేర్ను రూపొందించారని వారంటున్నారు. ఈ విషయం దరఖాస్తు చేస్తేగానీ తెలియడం లేదని ఆవేదన చెందారు. సాఫ్ట్వేర్లో ఎనిమిదేళ్ల సర్వీసు సీలింగ్ను ఎత్తేసి, పనిచేసిన మొత్తంకాలానికి పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, 2021 బదిలీల్లో వచ్చి.. మెర్జింగ్ వల్ల సర్ప్లస్ అవుతున్న టీచర్లకు పాతపాఠశాలలో స్టేషన్ పాయింట్లను కేటాయిస్తారు. అయితే సాఫ్ట్వేర్లో పాత పాయింట్లను పొందుపరిచేందుకు ఆప్షన్ ఇవ్వలేదని, స్పెషల్ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన టీచర్లకు సబ్జెక్టులు పెట్టుకునే ఆప్షన్లు లేవని, గ్రీవెన్స్కు సంబంధించిన సమస్యల ఫిర్యాదుకు ఇన్సర్ట్ చేయలేదని అంటున్నారు. వీటన్నింటిని సరి చేయాలని టీచర్లు కోరుతున్నారు.
25మంది హెచ్ఎంలకు షోకాజ్
బదిలీలపై హైకోర్టును ఆశ్రయించిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 25మంది ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో కొంతమంది హెచ్ఎంలు వారికి తలెత్తిన ఇబ్బందులను రిట్పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో వారికి అనుగుణంగా ఉత్తర్వులు వచ్చాయి. గ్రీవెన్స్లో తెలియజేసి సమస్యలు పరిష్కరించుకోకుండా హైకోర్టును ఆశ్రయించారని ఆర్జేడీల ద్వారా పాఠశాల విద్యాశాఖ బెదిరింపు ధోరణితో షోకాజ్ నోటీసులు జారీ చేసిందని అంటున్నారు. ఇటీవల నెలవారి పదోన్నతులు పొంది ఏడాది సర్వీసు మాత్రమే పూర్తిచేసుకున్నామని, ప్రస్తుతం జరిగే బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే తమ స్థానాలను ఖాళీ చూపుతారని వారంటున్నారు. పదోన్నతుల ద్వారా తాము పొందిన స్థానాలను తమకే కేటాయించాలని వారు కోరుతున్నారు.
0 Response to "Acceptance of online applications for transfer of teachers has started"
Post a Comment