Vacation for vacation! Difficulty for 'Ekopadhyayula'.. If you leave, you have to adjust another teacher.
సెలవుకు సెలవు!‘ఏకోపాధ్యాయుల’కు కష్టాలు.. సెలవిస్తే మరో టీచర్ను సర్దుబాటు చేయాల్సిందే.
- సాధ్యంకాక చేతులెత్తేస్తున్న ఎంఈవోలు
- రాష్ట్రంలో 8 వేల పాఠశాలల్లో ఇదే పరిస్థితి
- పుస్తకాలు, ప్రశ్నాపత్రాల బాధ్యత టీచర్లదే
- బాత్రూమ్లు, భోజనం ఫొటోలు కూడా
- అదనపు పనులతో బోధనపై తీవ్ర ప్రభావం
ఏ ఉద్యోగి అయినా అత్యవసర పరిస్థితుల్లో సెలవులు పెట్టడం సాధారణం. కానీ రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల టీచర్లకు మాత్రం సెలవు దొరకడం గగనమే. ఒక్క సెలవు కోసం ఎంఈవోల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి. రాష్ట్రంలోని దాదాపు 8 వేల ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఇదే పరిస్థితే నెలకొంది. బహుశా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదేమో. ఇటీవల ప్రకాశం జిల్లాలో భార్య ప్రసవించిందని విజ్ఞప్తి చేసినా ఓ టీచర్కు పెటర్నటీ సెలవు దొరకకపోవడం ఇందుకు ఉదాహరణ. ముఖ్యంగా తరగతుల విలీనం తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది. సుమారు 5 వేల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఇతర పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఆ పాఠశాలల్లో 1, 2 తరగతులు మాత్రమే మిగిలాయి. రెండు తరగతులకు కలిపి 20 మంది విద్యార్థులు మించని పరిస్థితి చాలా పాఠశాలల్లో ఉంది. దీంతో ఆ పాఠశాలల్లో ఒక్క టీచరే మిగిలారు. ఎవరికైనా సెలవు కావాలంటే సమీపంలోని ప్రాథమిక పాఠశాల నుంచి ఒక టీచర్ను ఆ రోజుకు సర్దుబాటు చేయాలి. అయితే విలీనం కంటే ముందు నుంచే చాలా పాఠశాలలు సింగిల్ టీచర్తో నడుస్తున్నాయి. ఎక్కడైనా సింగిల్ టీచర్ సెలవు పెడితే పక్క పాఠశాల టీచర్తో సర్దుబాటు చేయడం ఎంఈవోలకు సాధ్యపడటం లేదు. దీంతో సెలవులు లేవని ఎంఈవోలు తెగేసి చెబుతున్నారు. టీచర్లలో పురుషులకు 22, మహిళలకు 27 క్యాజువల్ లీవులు ఉంటాయి. వాటిలో సగం కూడా వాడుకోలేని పరిస్థితి. ఒకవేళ అత్యవసరమై టీచర్ సెలవు పెడితే ఆ రోజు బడి మూసేయాల్సి వస్తోంది. ఇందుకు ఎంఈవోలు అంగీకరించకపోవడంతో ఆరోగ్యం బాగోకపోయినా, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సి వస్తోంది.
టీచర్లపై అదనపు భారం
వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీచర్లపై యాప్ల ఒత్తిడి పెరిగింది. ఉన్నత పాఠశాలల్లో ఎక్కువ మంది టీచర్లు ఉన్నా ఈ పాట్లు పడలేకపోతున్నామని ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అయితే టీచర్ల కష్టాలు వర్ణనాతీతం. పిల్లలకు ఇచ్చే బ్యాగులు, పుస్తకాలు, శానిటరీ మెటీరియల్ను ఎంఈవో కార్యాలయాల నుంచి టీచర్లే తెచ్చుకోవాలి. పుస్తకాలను ఒక్కసారిగా కాకుండా రెండు మూడు దఫాల్లో ఇస్తున్నారు. బ్యాగులు ఒకసారి, షూలు మరొకసారి ఇస్తున్నారు. అలా ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి తెచ్చుకోవాలి. అలాగే పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయాన్నే ఎంఈవో కార్యాలయానికి వెళ్లి ప్రశ్నాపత్రాలు తెచ్చుకోవాలి. ఇవిగాక ప్రతిరోజూ ఉదయం బాత్రూమ్ ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. అలాగే విద్యార్థుల హాజరు యాప్లో నమోదు చేయాలి. అనంతరం మధ్యాహ్న భోజనం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. జగనన్న విద్యాకానుక కిట్లు అందించిన పిల్లల తల్లుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలి. అలాగే గుడ్లు తీసుకోవడం, వాటి నాణ్యత పరిశీలన వంటి పనులు అదనంగా ఉంటాయి. ఇక నెలలో కనీసం ఒక్కసారైనా ఎంఈవో ఆఫీసులో జరిగే సమావేశానికి హాజరుకావాలి. ఇలా లెక్కలేనన్ని అదనపు పనుల భారంతో మంచి బోధన ఎలా సాధ్యమని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి చెప్పినా.
రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల విధానం గతం నుంచీ కొనసాగుతోంది. తరగతుల విలీన సమయంలో ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని, పూర్తిగా ఏకోపాధ్యాయ విధానం రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు మంత్రిని కోరాయి. సింగిల్ టీచర్ విధానాన్ని తొలగిస్తామని, కనీసం ఇద్దరు టీచర్లు ఉండేలా చూస్తామని అప్పట్లో పలుమార్లు విద్యా శాఖ మంత్రి హామీ ఇచ్చారు. అయినా ఈ విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా నూతన పాఠశాలల విధానంపై ఇచ్చిన జీవో 117లోనూ 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉంటే ఒక్క టీచరే ఉంటారని పేర్కొన్నారు. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలల నుంచి బదిలీ కావాలని టీచర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బదిలీలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయి.®️
0 Response to "Vacation for vacation! Difficulty for 'Ekopadhyayula'.. If you leave, you have to adjust another teacher."
Post a Comment