Eligibility is six years. Shackles to attend!
అర్హత ఆరేళ్లు. హాజరుకు సంకెళ్లు!
- కేంద్ర నిర్ణయంపై విమర్శలు
- ప్రాథమిక పాఠశాలలపై తీవ్ర ప్రభావం
- ఒకటో తరగతిలో చేరాలంటే.. ఆరేళ్లు నిండాల్సిందేనా?
విద్యావ్యవస్థలో సంస్కరణల పేరుతో ఇప్పటికే ప్రాథమిక విద్య పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. బడుల విలీనంతో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇప్పటికే భారీగా తగ్గిపోయింది. ఇది చాలదన్నట్లు 1వ తరగతిలో చేరాలంటే చిన్నారుల వయసు ఆరేళ్లు నిండి ఉంటేనే ప్రవేశం కల్పించాలని కేంద్ర విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 22న అన్ని రాష్టాల్రకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్లు నిండితేనే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అంతకన్నా వయసు తక్కువ ఉంటే పాఠశాల యాప్ అడ్మిషన్స్ స్వీకరించదు. కానీ, ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలకు నాలుగేళ్లు నిండగానే బడిలో వదిలేసే పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సదుపాయం లేకపోవడంతో వీరంతా పిల్లల అల్లరిని భరించలేక ప్రైవేట్ బడుల్లో వదిలేసి వస్తున్నారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ఏటేటా తగ్గిపోతోంది. తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలు ప్రాథమిక విద్యకు ఆశనిపాతంగా మారనున్నాయి. ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలో ప్రవేశం కల్పించాలని నిబంధన పెడితే 4, 5 సంవత్సరాల పిల్లలంతా ప్రైవేట్బాట పడతారు. ఈ నిబంధన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరుకు సంకెళ్లు వేసినట్లేనని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.
హాజరు తగ్గితే బడి మూతే.
ఇప్పటికే 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ప్రాథమిక విద్యారంగం కుదేలైంది. తాజాగా ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆరేళ్ల వయసు నిబంధన పెడితే ఇప్పుడున్న సంఖ్య మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇటీవలే జిల్లాలో పదిలోపు విద్యార్థులున్న పాఠశాలలు, అదే పాఠశాలకు కి.మీ. పరిధిలోని బడుల వివరాలను పంపాలని రాష్ట్ర విద్యాశాఖ కోరింది. అంటే వీటిని సమీప బడిలో విలీనం చేసి పదిలోపు విద్యార్థులున్నవాటిని మూసేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా స్పష్టమవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గితే బడి మూత పడటం లేదా ఉపాధ్యాయులను కుదించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల పేదలకు ప్రాథమిక విద్యకు అందకుండా పోయే ప్రమాదం ఉంది.
నిర్ణయాలకు ముందు అభిప్రాయ సేకరణేదీ?
విద్యావ్యస్థలో మార్పులను స్వాగతిస్తామని, అయితే అకస్మాత్తు నిర్ణయాలు తీసుకోకుండా ఉపాధ్యాయ సంఘాలు, మేధావుల అభిప్రాయం కోరితే ఇలాంటి సమస్యలు ఎదురు కావని ఉపాధ్యాయులు అంటున్నారు. జిల్లాలు, మండలాల వారీగా విద్యార్థుల హాజరు తక్కువ ఉన్న పాఠశాలల వివరాలను సేకరించి.. ఆయా పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా హాజరు పెంచేందుకు ఉపాధ్యాయులకు ఏడాది గడువు ఇచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి హాజరు పెంచేలా లక్ష్యాలను ఇచ్చి ఉంటే ఫలితాలు వచ్చేవని ఉపాధ్యాయ లోకం అభిప్రాయపడుతోంది.
మిగులు చూపుతూ నియామకాలకు ఎసరు.
హాజరు తక్కువ ఉన్న విద్యార్థులతో సహా ఉపాధ్యాయులను ఎక్కువ సంఖ్య ఉన్న బడుల్లో విలీనం చేసి.. ఉపాధ్యాయులను తాత్కాలికంగా ఉంచి బదిలీ సందర్భంగా వారిని మరోచోటికి పంపిస్తారనే చర్చ జరుగుతోంది. ఇలా విలీనం చేస్తూ ఉన్న ఉపాధ్యాయులతోనే సర్దుబాటు చేస్తూ మిగులు కింద ఉపాద్యాయులను చూపే ప్రమాదం ఉంది. ఉదాహరణకు వెయ్యి మంది ఎస్జీ టీచర్లు ఉంటే విలీనం కారణంగా 300 మంది అదనంగా ఉన్నట్లు చూపి ప్రభుత్వం పోస్టులకు ఎసరు పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని ఏదో ఒకచోట సర్దుబాటు చేసి రాబోయే రోజుల్లో పదవీ విరమణ పొందే స్థానాల్లో వీరిని నియమిస్తారని, కొత్తగా డీఎస్సీ ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మార్గదర్శకాలు రాలేదు
పిల్లలకు 6 సంవత్సరాలు వయసు దాటిన తరువాత పాఠశాలల్లో చేర్చుకోవడంపై కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుతానికి అమలు చేయడం లేదు. సరైన స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే విద్యాసంవత్సరం స్పష్టత రావొచ్చు. మార్గదర్శకాల ప్రకారం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.
సాయిరాం, అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి
0 Response to "Eligibility is six years. Shackles to attend!"
Post a Comment