An intractable deadlock in teachers' unions
టీచర్ల బదిలీల్లో తొలగని ప్రతిష్టంభన
- టీచర్ల బదిలీల్లో కొనసాగుతున్న గందరగోళం
- సర్వీస్ పాయింట్లు, స్టేషన్ పాయింట్ల కేటాయింపు అస్తవ్యస్తం
- ఎయిడెడ్ టీచర్లకు సర్వీస్ పాయింట్లతో సరి పెట్టారు
- బదిలీల కోసం 5,994 దరఖాస్తులు
- వీరిలో 5, 8 సంవత్సరాలు నిండినవారు 1,940 మంది
- బదిలీల ప్రక్రియపై కోర్టుకు వెళ్లే యోచనలో టీచర్లు
టీచర్ల బదిలీల్లో గందరగోళం తొలగడం లేదు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల కోసం దరఖాస్తులు చేసుకునే గడువు పూర్తయింది. టీచర్లకు పాయింట్ల కేటాయింపులో అస్పష్టత కొనసాగుతూనే ఉంది. కొన్ని టీచరు పోస్టులు బ్లాక్లో పెడతామని విద్యాశాఖ అధికారులు చెప్పడంతో అయోమయం నెలకొంది. తాము కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు అవకాశం ఉండదని వాపోతున్నారు. వీటన్నింటిపై కొందరు టీచర్లు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఇన్ని సమస్యల నడుమ ఈ ఏడాది టీచర్ల బదిలీలు పూర్తిస్థాయిలో జరుగుతాయా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి._
ఉమ్మడి జిల్లాలో బదిలీల కోసం 5,994 మంది టీచర్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఈనెల 29వ తేదీన తాత్కాలిక సీనియారిటీ జాబితాలను ప్రకటిస్తారు. వాటిపై అభ్యంతరాలను టీచర్లు ఈనెల 30వ తేదీలోగా తెలియజేయాల్సి ఉంది. మే 31వ తేదీన, జూన్ 1వ తేదీన వచ్చిన అభ్యంతరాలను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తారు. జూన్ 2, 3 తేదీల్లో టీచర్లకు వచ్చిన పాయింట్లను ఆధారంగా చేసుకుని టీచర్ల సీనియారిటీ జాబితాలను ప్రకటిస్తారు. 4వ తేదీన ఖాళీలను చూపుతూ వెబ్లో వివరాలు పెడతారు. జూన్ 5, 6 తేదీల్లో ప్రధానోపాధ్యాయులు ,స్కూల్ అసిస్టెంట్లు వెబ్లో ఆప్షన్లు కోరుకోవాలి. ఎస్జీటీలు 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వెబ్ అప్షన్లు పెట్టుకోవాలి. 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు టీచర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇబ్బందులివీ..
టీచర్లకు సంబంధించి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరుగుతోంది. పదోన్నతులకు అంగీకారం తెలిపిన వారి వివరాలు విద్యాశాఖ డైరెక్టర్కు పంపుతున్నారు. అక్కడి నుంచే పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులు, వారికి కేటాయించిన పాఠశాల వివరాలను పంపుతామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పదోన్నతి పొందిన టీచర్లకు ముందస్తుగా ఏ పాఠశాలను కేటాయిస్తారో తెలపాలని ఉపాఽధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. పదోన్నతుల ప్రక్రియను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యా సంవత్సరాలను లెక్కగడుతుండటంతో 2015 నవంబరులో బదిలీ అయిన ఉపాధ్యాయులకు స్టేషన్ పాయింట్లు పూర్తిగా రావడం లేదు. 2017లో బదిలీ అయిన టీచర్లకు స్టేషన్ పాయింట్ల అధికంగా వస్తున్నాయి. ఈ రెండు సంవత్సరాల మధ్య బదిలీ అయిన టీచర్లకు పాయింట్ల కేటాయింపులో నెలకొన్న గందరగోళాన్ని సరిచేయాలని టీచర్లు కోరినా సాఫ్ట్వేర్లో మార్పులు చేయలేదు. దీంతో టీచర్లు జూన్లో కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. ఎయిడెడ్ టీచర్లను గడిచిన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేశారు. వారికి సర్వీస్ పాయింట్లు మాత్రమే ఇస్తున్నారు. గతంలో పనిచేసిన స్టేషన్పాయింట్లు ఇవ్వడం లేదు. ఈ అంశంపైనా గందరగోళం నెలకొంది. ఈ అంశాలన్నింటిపై ఇప్పటికే కొందరు టీచర్లు కోర్టును ఆశ్రయించారు.
23 పోస్టులకు 19 భర్తీ
మచిలీపట్నం టౌన్ : జిల్లాలో 23 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు 40 మంది సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరిలో పదోన్నతులను 21 మంది తిరస్కరించారు. 19 మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు అంగీకరించారు. మిగిలిన 4 పోస్టులకు మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇవ్వనున్నారు.
0 Response to "An intractable deadlock in teachers' unions"
Post a Comment