Should be taught in the mother tongue
మాతృభాషలోనే బోధించాలి
- కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలివ్వాలని నిర్ణయం
- రాష్ట్రేతర తెలుగు అకాడమీలు ఏర్పాటు చేయాలి
- తెలుగు నుడి-బడి చర్చావేదికలో పలు తీర్మానాలు
- వివరాలు వెల్లడించిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య
నూతన జాతీయ విద్యా విధానం ద్వారా 5వ తరగతి వరకూ మాతృభాషలోనే బోధించేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తెలుగు నుడి-బడి జాతీయ చర్చావేదిక తీర్మానించింది. ఈ మేరకు కేంద్రానికి వినతిపత్రాలు అందించాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్రేతర తెలుగు అకాడమీ ఏర్పాటు చేసేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞాపనలు అందించనుంది. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న విద్యాలయాల్లో ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాల కొరత ఉందని, నిర్వహణ సక్రమంగా ఉండేలా వాటి బాధ్యతను రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యనిర్వాహక సభ్యులకు అప్పగించాలని పేర్కొంది. ఇటీవల నిర్వహించిన ఈ చర్చావేదిక ‘సమాపనోత్సవం’ ఆదివారం వర్చువల్ విధానంలో జరిగింది. ఇందులో వందకుపైగా తెలుగు సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ప్రముఖుల సూచనలు, సలహాల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో తెలుగు భాషాభివృద్ధికి పలు తీర్మానాలు చేసింది. వీటిని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరావు ప్రవేశపెట్టారు.
పొరుగు రాష్ట్రాల్లో భాషా అల్ప సంఖ్యాకవర్గ రాయితీల చట్టం అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ముమ్మరంగా ప్రయత్నాలు జరగాలి
ఇతర రాష్ట్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న తెలుగు విద్యార్థుల అభీష్టం మేరకు రాష్ట్రేతర తెలుగు సంస్థల ద్వారా మాతృభాష నేర్పించాలి.
ఇతర రాష్ట్రాల్లో ఎంతో మంది తెలుగువారు మాతృభాషను మర్చిపోయి స్థానిక భాషీయులుగా మారారు. వారికి తెలుగును సులభంగా బోధించి, తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ధ్రువీకరణ పత్రం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
అంతర్జాలంలో ప్రతి నెలా తెలుగు భాషలో వ్యాసరచన, పద్య పఠనం, కథలు, సాంస్కృతిక పోటీలను నిర్వహించాలి.
అప్పుడే భావితరాలకు అందించగలం
ప్రస్తుత తరుణంలో మాతృభాష, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ ఆవశ్యకత ఎంతో ఉంది. భాష, సాహిత్యాన్ని కలిసికట్టుగా పరిరక్షించుకుంటేనే వాటిని భావితరాలకు అందించగలుగుతాం.
- జస్టిస్ ఎం.రాజశేఖర్, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి
కలిసికట్టుగా కృషిచేయాలి
మాతృభాష పరిరక్షణకు దేశంలోని తెలుగువారంతా కలిసికట్టుగా కృషి చేయాలి. ప్రభుత్వాలపై ఆధారపడకుండా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కృషి చేస్తోంది.
- జస్టిస్ రామలింగేశ్వరరావు, విశ్రాంత న్యాయమూర్తి
రాష్ట్రేతర తెలుగు అకాడమీ అవసరం
రాష్ట్రేతర తెలుగు అకాడమీ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉంది. ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాషాభివృద్దికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సహకారం అందించాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సిలబస్ ప్రకారం పాఠ్యాంశాలను తెలుగులోకి అనువదించి పుస్తకాలను అందించేలా బాధ్యత తీసుకోవాలి.
- మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఉపసభాపతి
ప్రపంచభాషగా అభివృద్ధి చెందాలి
చిన్నారులు, యువతకు మాతృభాషపై అభిరుచిని పెంచాలి. యువతకు తెలుగుపై మమకారం పెరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రాచీన భాష స్థాయి నుంచి ప్రపంచ భాషగా అభివృద్ధి చెందాలి. ఈ లక్ష్య సాధనకు భాషా సైనికులను సిద్ధం చేయాలి.
- ముక్తేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్, కూచిబోట్ల ఆనంద్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు
భాషకు గుర్తింపు
పొరుగు రాష్ట్రాల్లో తెలుగువారి సంఖ్యాబలాన్ని చూపించినప్పుడే భాష, సంస్కృతికి తగిన గుర్తింపు దక్కుతుంది. తమిళనాడు విద్యావిధానం, అక్కడి తెలుగు సంస్థల కృషితో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో క్రమేణా మార్పు కనిపిస్తోంది. ఫలితంగా తెలుగు భాషాభివృద్ధికి సానుకూల ఫలితాలు వస్తున్నాయి.
- సీఎంకే రెడ్డి, తమిళనాడు
0 Response to "Should be taught in the mother tongue"
Post a Comment