10th Exams: Only 100 days left for ten exams: If you do this, success is yours.
10th Exams :పది పరీక్షలకు మిగిలింది 100 రోజులే : ఇలా చేస్తే విజయం మీదే.
సమయం లేదు విద్యార్థులారా.. పరీక్షల యుద్ధానికి సిద్ధం అవ్వండి.. ఏపీలో పదవ తరగతి పరీక్షలకు కేవలం 100 రోజులే సమయం ఉంది. వంద రోజుల్లలో పాసవ్వడం ఎలా అన్నదానిపై ఫోకస్ చేయండి.. మంచి ఫలితాలు సాధించండి.
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలకు సరిగ్గా వంద రోజులే సమయం ఉంది. అసలు ఈ ఏడాది సగానికిపైగా విద్యా సంవత్సరం కరోనా ఆంక్షలతోనే మునిగిపోయింది. సాధరణంగా పదో తరగతి విద్యార్థులు అంటే.. తొమ్మిదో తరగతి ముగుస్తూనే వేసవి సెలవుల నుంచి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది అంతా తలకిందులైంది. విద్యార్థులతో కరోనా ఓ ఆట ఆడేసింది. దీంతో స్కూళ్లు.. పాఠాలు లేకుండా సగం ఏడాది గడిచిపోయింది. అయినా విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వకుండా.. పదో తరగతి విద్యార్థులకు నవంబర్ 2 నుంచి తరగతులు ప్రారంభించారు. జూన్ 7 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అంటే సరిగ్గా ఇంకా 100 రోజులే సమయం ఉంది.. పరీక్షలకు ఉన్నది తక్కువ సమయం.. పరిక్షల నిర్వహణలో మార్పులు, సిలబస్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.
సాధరణంగా ప్రతి ఏడాది పరీక్షలకు వంద రోజుల నుంచి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి సిలబస్ రివిజన్ చేయిస్తారు. కానీ ఈ సారి సిలబస్ కూడా పూర్తి చేయలేని పరిస్థితి. కరోనా కాటుకు తోడు మధ్యలో పంచాయతీ ఎన్నికలు.. రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఇలా ఉపాధ్యాయులకు అన్ని అడ్డంకులే ఎదురయ్యాయి. దీంతో పరీక్షలకు అవసరమైన సన్నద్ధత కనిపించడం లేదు. ప్రైవేటు, ప్రభుత్వం పాఠశాలలు అని తేడా లేకుండా ఇప్పటి వరకు చాలా పాఠశాల్లో 60 శాతం మాత్రమే సిలబస్ పూర్తైనట్టు తెలుస్తోంది. మిగితా సిలబస్ ను మార్చి మధ్య నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఇంత తక్కువ సమయంలో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన బాద్యత అందరిపైనా ఉంది. వెంటనే విద్యాశాఖ అప్రమత్తం కాకుంటే వెనుకబడిన విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో గంట అదనంగా ప్రత్యేక తరగతులకు సమయం కేటాయించే వారు. మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులకు లక్ష్యాలను విధించేవారు. ఈ ఏడాది సమయం లేనందున వీటికి ప్రత్యామ్నాయంగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది.
గతంలో సబ్జెక్టుకు రెండు పేపర్లు, హిందీకి ఒకటి చొప్పున ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు ప్రశ్నపత్రాలను ఏడింటికి కుదించారు. సామాన్యశాస్త్రం మినహా అన్ని సబ్జెక్టులకు ఒక పరీక్షే ఉంటుంది. ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం నమూనా ప్రశ్నపత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు అవి రాలేదని వివిధ జిల్లాల అధికారులు చెబుతున్నారు. కేవలం బ్లూప్రింట్ మాత్రమే ఇచ్చారని. ఇందులో ఐచ్ఛికం, పెద్ద ప్రశ్నలు, చిన్న ప్రశ్నలు ఇలా విభజిస్తూ ఎన్నెన్ని మార్కులు కేటాయించారన్నది మాత్రమే సూచించారని.. సబ్జెక్టులో ఒక అధ్యాయం నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు వస్తాయో ? ఏఏ అధ్యాయాల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఇస్తారో ఇంకా స్పష్టత రావడం లేదంటున్నారు. సమాధాన పత్రాలు వస్తేనే ప్రణాళిక సాధ్యమని అధికారులు చెబుతున్నారు.
చేయాల్సింది ఇదే:
అతి తక్కువ సమయం ఉండడంతో ఈ సోమవారం నుంచి అన్ని పాఠశాలల్లో అదనపు సమయం కేటాయించాల్సి ఉంటుంది. సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించే యోచనలో జిల్లాల అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులు చాలారోజులు బడికి దూరం కావడంతో గతంలో చదివింది అంతా మరిచిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో వారిపై ఒకేసారి పెను భారం మోపకుండా అర్థమయ్యేలా అధ్యాపకులు బోధించాలి. పరీక్ష విధానం మారినందున.. దానికి తగ్గట్టు విద్యార్థులను సన్నద్ధం చేయాలి. పాఠ్యాంశాల్లో ప్రధానమైన అంశాలు మాత్రమే బోధించి, వాటి నుంచి సొంతంగా నోట్సు తయారు చేసేలా ప్రోత్సహిస్తే కొంత ఫలితాలు రావొచ్చు. భయం, ఒత్తిడికి గురికాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థుల్లో భయం పోగెట్టే విధంగా అధ్యాపకులు ప్రణాళికలు రచించాల్సి ఉంది.
0 Response to "10th Exams: Only 100 days left for ten exams: If you do this, success is yours."
Post a Comment