Growing awareness on organ transplantation in Telugu states
అస్తమిస్తూ.. వెలుగునిస్తున్నారు
- జీవన్మృతుల త్యాగనిరతి
- అవయవదానంపై తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న అవగాహన
- చైతన్యపరుస్తున్న జీవన్దాన్
కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం.. మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక ఉత్కృష్ట సేవాయజ్ఞం.. ఆత్మీయుడిని కోల్పోయిన పెనువిషాదంలో ఉన్నప్పటికీ అతడి అవయవ దానానికి ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకుంటున్న కుటుంబీకుల సేవాస్ఫూర్తి మహోన్నతం.. మట్టిలో కలిసే అవయవాలు మరో మనిషి శరీరంలోకి వెళ్లి నిత్య చేతనంగా నిలుస్తాయన్న భావనే వారి కార్యశీలతలోని నిగూఢార్థం..
ఒకరికి గుండె, ఒకరికి ఊపిరితిత్తులు, మరొకరికి కళ్లు, ఇంకొకరికి మరో అవయవం.. ఇలా అవయవాల కోసం నిరీక్షిస్తున్న ఆపన్నులెందరో! వారి అవసరాలను తీర్చేందుకు 'జీవన్దాన్' అనుసంధానకర్తగా నిలుస్తోంది. అవయవ దానమంటే ఉన్న భయం, అపోహలను తొలగిస్తోంది. కరోనా విజృంభించిన గతేడాది కూడా అవయవదాన ప్రక్రియను విజయవంతంగా కొనసాగించింది. ఇది మరింత పుంజుకొని ఈ ఏడాది ఒక్క నెలలోనే 24 అవయవదాన శస్త్రచికిత్సలు జరిగాయి. యువత సైతం పుట్టిన రోజు, పెళ్లిరోజులాంటి ప్రత్యేక సందర్భాల్లో అవయవ దాతలుగా పేరు నమోదు చేసుకుంటున్నారు. అవయవదానం చేసి స్ఫూర్తి నింపిన కొందరు జీవన్మృతులు, సహకరించిన కుటుంబాలపై ప్రత్యేక కథనం..
సైబరాబాద్ పోలీసుల 'మరో జన్మ'
అవయవదాన ప్రాధాన్యాన్ని వివరిస్తూ 'మరోజన్మ' కార్యక్రమం ద్వారా హైదరాబాద్లోని సైబరాబాద్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. జనవరి 18న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవలే జీవన్మృతుడైన కానిస్టేబుల్ ఆంజనేయులు అవయవదానంతో మరో 8మందికి ప్రాణం పోశారు. పోలీసుల 'మరో జన్మ' జీవన్దాన్కు ఊతమిచ్చింది.
అవయవదానంపై ప్రజల్లో అవగాహన వచ్చింది. ఆన్లైన్, ఇతర వేదికల ఆధారంగా జీవన్దాన్లో పేరు నమోదు చేసుకుంటున్నారు. కొవిడ్-19 నుంచి కొంత కుదుటపడ్డాక ఇప్పుడిప్పుడే దాతల సంఖ్య పెరుగుతోంది.
0 Response to "Growing awareness on organ transplantation in Telugu states"
Post a Comment